పుట:కాశీమజిలీకథలు -04.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

లవంగి యంగరాగవాసనలు కేశముల నలమిన కుసుమతైలపరిమళముతోఁ గలసి దెసల నావరించుటయు నా తావి యాఘ్రాణించి యందలి జను లచ్చెరువందుచు పలుదెసల బరికించి యా యంబుజాక్షి చెంతకరుదెంచి యీక్షింపఁ దొడంగరి. సోగవెండ్రుకలకప్పు వాలుఁగన్నుల యొప్పు తళుకుఁజెక్కుల సౌరు నుదురు తీరుం జూచి వెరఁగు పడుచుఁ బురుషుం డని స్త్రీలును స్త్రీయని పురుషులును విభ్రాంతితో మోహింపఁ జొచ్చిరి. ప్రజలు తన్నావరించి చూచుచుండటఁ గిలకించి యక్కలికి వెండ్రుకల ముడివైచుకొని యుష్ణీషముఁ బెట్టుకొని యట్టె లేచి విశ్వనాథునాలయమునకుం బోవ నొకవీథింబడి నడుచుచుండెను. అట్టి సమయమునఁ గొందఱు తైర్ధికు లా వీధిం బోవుచు నొకరితో నొకరిట్లు సంభాషించుకొనుచుండిరి. కొందఱు “నిరిటి శివరాత్రికి మే మీ తీర్థమునకు వచ్చితిమి. ఏ యలజడియు లేదు. ఇప్పుడిన్ని పరీక్షలు చేయుచున్నా రేమి? దేవతాదర్శనమునకు రానీయరుకాఁబోలు" మఱికొందఱు "అయ్యో? మీ రెఱుంగరా? వినుండు. పాదుషాగారి కూఁతురు లవంగి యను చిన్నది విశ్వేశ్వరలింగమునకు స్వయముగా నభిషేకముఁ జేయవలయునని కోరిన నామెతండ్రి యప్పఁనిఁ జేయింతునని శపథమునఁ జేసి యిచ్చటికిఁ బంపినాఁడట. ఈ యూరఁ బండితభట్టుగారి కుమారుఁడు వీరుఁడనువాఁడు తురకలు రాకుండ వ్యుహములు పన్ని కాచుచున్నాఁడు. మన కాటంకములేదు. మనము తురకలమేమో యని పరీక్షలు చేయుచున్నారు. అంతియకాని మఱియొకటి కాదు.

మఱియొకచోట మంగలివాడు తలారివానిం బిలుచుచుండ నిట్టి సంవాదము విననయ్యెను.

మంగలి – ఓరీ? తలారివెంకా? గంగఁడేమి చేయుచున్నాఁడు ?

వెంకి – రాత్రి తెల్లోర్లు గస్తీతిరిగి యిప్పుడే కాదంటయా వచ్చి తొంగున్నాఁడు. ఇంతలో ఏంపని వచ్చింది.

మంగ - ఈ వేళేమో పాదుషాగారి లవంగి వచ్చి గుళ్ళో ప్రవేశిస్తుందట. యిప్పుడేమో వూళ్ళోవాళ్ళందఱిని కత్తికట్టుకుని సిద్ధముగా వుండమని చాటించాలంట బేగిలేపు ఈరుఁడుగారు సెప్పినారు.

వెంకి - ఓరిబాబోరిబాబూ యీ చాటింపులతో చస్తున్నాము మేమేటయ్యా నీ కస్తమానం గనిపిస్తాము ఈ వేళ వీరడిది చాటింపువంతు.

మంగలి - ఇప్పుడు వంతులు పనికిరావు. వూరంతా అల్లరిగావుంది. అందఱు పనిచేయలంట; లేపు.

వెంకి - లెగు లెగు ఇంకా తొంగున్నావేమి ? పనికి మంగలాయన పిలుస్తున్నాడు. చాటించాలంట. .

గంగడు --- (దొర్లుచు) దీనిముందా! వంత మందికాదు. బాటింపువంతు