పుట:కాశీమజిలీకథలు -04.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

23

మ॥ అంత ప్రధితప్రభావయుత దివ్యప్రహాదినీసత్తటా!
       ధ్యాళాంచ త్పృథుసౌధమధ్యగత దేవాగారసందీప్తవి
       శ్వేశాఖ్యాక మహేశలింగ మది నీవె కావె? యైక్యస్థితిన్
       గాశీపట్టణరాజమా ! యిదె నమస్కారంబు నీకిమ్మెయిన్॥

అని నమస్కరించి పరమానందముతోఁ గాశీఖండంబునంజదివిన విశేషంములు జ్ఞాపకము దెచ్చుకొనుచు సఖులతో

మ॥ అది గంగానది హారమట్లు నగరాభ్యర్ణంబునంబొల్చు న
       ల్లది విశ్వేశ్వరునాలయం బగుఁ దదభ్యాళంబునం బార్వతీ
       సదనం జొప్పెడు బిందుమాధవుని వేశ్మం బల్లదే! కామిత
       ప్రదుఁడౌడుంఠిగణేశు నాలయము నాప్రాంతంబునంజూడుఁడీ!

అని తదీయమందిర విశేషంబుల నెఱింగినట్లు వారి కెఱింగించుచుఁ గాశీపురాభిముఖముగా నాచేడియ నడువందొడంగినది. లవంగి చిన్నతనమునుండియు నశ్వగజాందోళికారోహణ క్రీడల శిక్షింపబడినది. కావున నాపయనమును శ్రమగా గణింపక నడుచుచుండెను. ఇంతలో సూర్యోదయమైనది. అప్పు డా తెలువరులు పెద్దతెరువునంబడి కాశికింబోవు తైర్థికులం గలసికొని యరిగిరి.

పురద్వారంబున రక్షక పురుషులు వారిం బరీక్షించి మీ రెవ్వరని యడిగిన నితం డొక రాజకుమారుడు. యాత్రార్థమై యరుదెంచినాఁడు. పరిజనం బంతయు వెనుక వచ్చుచున్నది. స్నానమునకు వేళమిగులునని ముందుగా నడచి వచ్చుచున్నాఁడని చెప్పి యా సఖురాండ్రు లవంగితోఁ గూడ నీటిలోఁ బ్రవేశించిరి. అంతవఱకు నే యంతరాయము వచ్చునో యని యమ్మచ్చెకంటి వెఱచుచునే యున్నది. అప్పుడు ముప్పిరిగొను సంతసముతో వడివడి రాజమార్గంబున నడుచుచు నడుమ నడుమఁ దైర్థికులఁ బరీక్షించుచున్న రాజభటులఁ జూచి వెరచుచు సమ్మర్దములోఁ దూరుచుఁ నొరులకుఁ దెలియకుండఁ తప్పించుకొని యెట్లో గంగానదికిఁ జనిరి. లవంగి యా గంగానదిం జూచి యంతరంగం బుప్పొంగ మేనం బులక లుద్భవింపఁ జేతులు ఫాలంబునం జేర్చి నమస్కరించుచు ...

శా॥ గంగా! నిన్గడుదవ్వున న్మనముసాగంగాఁ దలంపంగ వే
      గం గారుణ్యముతోడ ముక్తికరుగం గావింతు వన్నన్వబిం
      చంగా నేటికిఁదావకాంబుకణసుస్నాంతుడు పూతుండఁటం
      చుం గైవల్యము వానిదొడ్డి దివిజక్షోణీజమై యొప్పదే?

అని యనేక స్తోత్రములు సేయుచు మెరుంగుదుస్తుల నూడ్చి గట్టునంబెట్టి తిరుగ గంగలోన నెట్లో స్నానముచేసి మరల నా పట్టుబట్టల ధరించి యంగీలు ధరించి తల యారుచుకొనుచు నొక్కింతతడవు గంగయొడ్డునం గూర్చుండి యచ్చటివిశేషములఁ జూచుచుండెను.