పుట:కాశీమజిలీకథలు -02.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

కాశీమజిలీకథలు - రెండవభాగము

జూడని వెడదమోము మెకంబొకటి మాయడవిం దిరుగుచున్నది. దానింబడనేయ నేయు మాతూపు లాపెనుసింగంపుటేపు మాపనోపకపోవుటయేకాక సైకపువేకి యేనిం బుట్టింపక లేకపోయినవి. అమ్మకచెల్లా! అల్లాటి మేటిమెకంబు నిఁక చూడబోము. దాని యఱపు వినినంత నేజంతువైన వెరపున సమయకమానదు. మానిసులం బేర్కొననేల? ఏయడలు నెఱుంగని మాపల్లెలవారెల్ల నుల్లములుపగుల రేయిఁ బగలు గన్నుమూయక నాలుబిడ్డల కెడమై పెనుమ్రాను లెక్కి పొక్కుచున్నవారు. సామీ! మాయావడి యుడిగింప దేవర చెచ్చెర నచ్చటికి విచ్చేయవలయును. భవదీయబాహుబలంబునంగాక యామెకంబు సమయదని విన్నవించిన నాలించి యారాజచంద్రుండు మందహాసము చేయుచు నిట్లనియె.

శబరులారా! వెరవకుడు. రేపకడవచ్చి యచ్చపలకేసరిం బరిమార్చి మిమ్ము నయ్యడవి నెల్లెడల విచ్చలవిడిఁ గ్రమ్మరఁజేసెద. మాకును దడవులంబట్టి యడవులం దిఱుగు వేడుకగలిగియున్నయది. దైవకృపచే నేటికది యొనగూడినది. తెఱవెఱింగింప నిరువురుమాత్రము నిలిచి తక్కినవారు పొండని యమ్మన్నెగాండ్ర కాజ్ఞయిచ్చి యప్పు డప్పుడమిఱేఁడు అఖేటనయాత్రాప్రకారంబు పురంబెల్లఁ జాటంబంచి తత్పరికరంబు సమకూర్ప నమాత్యవర్గమునకు నియమించి యంతఃపురమునకుఁ బోయెను.

చంద్రసేనయు నందుచితసఖీపరివృతయై మనోగతంబు వక్కాణింపుచు బతిరాక విని సంతోషముతో దిగ్గున లేచి డగ్గర నెదురేగి కైదండము యిచ్చి తోడి యిచ్చి మచ్చిక దోప గద్దియం గూర్చుండఁబెట్టి ప్రాంతమున నిలువంబడి యింపుగులుకు పలుకుల నతనిమతి కుతుకపరుచుచుండ నప్పు డొకయొప్పులకుప్ప తెప్పున నప్పూబోఁడి కిట్లనియె.

బోఁటీ! మనమేటికి సందియమందవలయును? మనమనుకొనిన కల తెఱంగి మహారాజున కెఱింగింపుము. సకలకళానిపుణుండగు నితండందలి శుభాశుభఫలంబుల వివరింపఁ గలఁడని నుడివిన విని సంతసించుచు నారాజపత్ని ఔనౌను మంచిసంగతి జ్ఞాపకము చేసితివి. నే నిమ్మానవనాథుని సేవావసరములో మరచిపోయితిని యడిగి తెలుసుకొనియెదంగాక యని యతని మొగమునం జూట్కులు నిగుడింపుచు మెల్లన నిట్లనియె.

నాథా! నిన్నటిరాత్రి వేకువజామున నాకొక కలవచ్చినది. దాని మంచిచెడ్డల నాప్రాణసఖుల నడిగిన వారు నిరూపింపలేకపోయిరి. అది దేవర నడిగి తెలిసికొనవలయు నని నిశ్చయించి తత్ప్రకారంబంతయుం జెప్ప మరతునని యీపత్రంబున వ్రాయించితిని. నిదిగో చూడుఁడని చేటికచే నాపత్రికం దెప్పించి న్బపతి కిచ్చినం బుచ్చుకొని యమ్మానవపతి పలుమారు పఠించి శిరఃకంపము చేయుచు నిట్లనియె.

అబలా! నీకలతెరం గరయ నాయంతరంగము కలంకఁజెందుచున్నయది.