పుట:కాశీమజిలీకథలు -02.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతఫలము కథ

73

నేను దినిన నేమి లాభమున్నది తారావళి కిచ్చిన మిగుల సంతసించునని నాకు భోగభామినియైన తారావళి యనువేశ్య కిచ్చితిని.

అదియు దాని విశేషము లరసి మిగుల మురియుచు దానుసైతము భక్షింపక కేళీసౌధంబున గందుకముగా వ్రేలగట్టినది. ఇంతలో రాజభటు లాఫలమును గురించి వెదకుచుండుట విని మోసము వచ్చునని జడియుచు దాని నెచ్చటనయిన బారవేయుమని యావేశ్యకు బోధించితిని. అదియు భయపడుచు దానినొకపెట్టెలో బెట్టి తన దాదికిచ్చి కందకములో పారవేసి రమ్మని రాత్రివేళ నంపినది ఇంతవరకె నేనెరుంగుదునని యా కంసాలి నుడివెను.

పిమ్మట నాదాసిని నిలబెట్టి చెప్పమని రాజభటులు బంధించిన నాదాది గజగజ వణంకుచు నిట్లనియె అయ్యా! నే నాఫలమున్న పెట్టెను నెత్తిమీద బెట్టుకొని యాకందకమునకు బోవుచు దారిలోనున్న నావిటపురుషునిం జూడవలయునని వాని యింటికి బోయిన వాడు నన్ను జూచి సంతోషించుచు నీపెట్టెలో నున్నదియేమని యడిగెను.

అప్పుడు నేనిదియొక యద్భుతఫలము దీనిని నీకొరకెంతో కష్టపడి తెచ్చితిని. చూడుమని యాపెట్టెతీసి చూపించితిని. వాడు దానికి సంతసించుచు నాకు దన యందుగల ప్రేమాతిశయమును గురించి మిక్కిలి మెచ్చుకొనియెను. ఆ రాత్రి యచ్చటనుండి యుదయమున మరల మాయేలికసానియైన తారావళి యింటికివచ్చి యాఫలమును గందకములో బారవైచితినని చెప్పితిని. అని యిట్లు దాది చెప్పిన తరువాత రాజభటచోదితుడైన యావిటపురుషుడు సభవారికిట్లనియె.

అయ్యా ! నేనిట్టిపండు తినిన లాభమేమియు గలుగదు. అంగడికి దీసికొనిపోయి యమ్మిన నెక్కుడువెల రాగలదని నిశ్చయించి దీనికాపట్య మెరుగక ధారాళముగా నంగడికి దీసికొనిపోవుచుంటిని. దాని పరిమళము నలుమూలలు వ్యాపించినది. జనులందరు వెఱగందుచు నీగల ముసిరినట్లు మూగిరి.

అంతలో రాజభటులు వచ్చి నన్ను బట్టుకొని నికీఫల మెక్కడ దొరికినదని నిర్భందించుచు బందీగృహంబునకు దీసికొనిపోయిరి. వారి దెబ్బలకు దాళలేక నేను యథార్ధము జెప్పితిని. తరువాత గ్రమముగా నాదాదిని తారావళిని కంపాలిని దొంగలను బట్టుకొని యీ రాజభటులు దాని గుట్టంతయు బయలుపరచిరి. అని యావిటపురుషుడు చెప్పెను. అప్పుడందరు కరతాళములు వాయించిరి. ఈరీతి ఫలాగమనవృత్తాంతమంతయు సభ్యులకు దేటబడిన పిమ్మట నాపుష్పసమాగమవిధముగూడ దెలుపుటకయి వారివారి నాజ్ఞాపించిరి. అందుమూలముగా వృద్ధబ్రాహ్మణుడు లేచి మెల్లన నిట్లనియె.