పుట:కాశీమజిలీకథలు -02.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

కాశీమజిలీకథలు - రెండవభాగము

అంత దివసాంతమగుటయు నా కాంత వింతగా అలంకరించుకొని స్వాంతంబున కంతుసంతాప మెంతేని వేధింప నెట్లో భోజనాదిక్రియలు నిర్వర్తించి విద్యార్థులందరు సరస్వతీనిలయమునకు బోయిరోలేదో అంతలోనే తాను శయనగృహమునకు బోయి నారాకకై వేచుచుండెను. నేనును దోడివారిని దాటించుకొని యా గదిలో జేరితిని. ఆపైన నేమి జరిగెనో నేను జెప్పలేను.

రాజా! మఱి జెప్పవలసిన దేమున్నది? మేమిరువురము స్మరానందసాగరమగ్నులమై యొడలెరుంగక మేనులుపెనివైచుకొని మంచముపై బండుకొనియున్న సమయంబున మాగురువుగారు తటాలున తలుపు తెరచుకొని లోపలకువచ్చిరి. విద్యార్ధు లుండుమందిరము దూరముగా నున్నది. ఇతరు లీలోపలకు వచ్చువాడుకలేదు. కావున మేము తలుపు బిగించుకొనకయే పండుకొంటిమి. దానంజేసి యతఁడు నిరాటంకముగా మేమున్న గదిలోనికి వచ్చెను. ఆయన మాచర్యల గ్రహించి మ్ముబట్టుకొనుతాత్పర్యముననే యట్లూరికిబోయెదనని చెప్పి యెచ్చటనో డాగి అప్పుడు వచ్చినట్లు తర్వాత నూహించితిమి.

అట్టి యవస్థలో నాయననుజూచినప్పుడు మాహృదయము లెట్లుండునో నీవే యూహింపుము. తలలు శరీరమునుండి వేరై పోవుచున్నట్ల తలంచి యేమియుం బలుకనేరక కొంతసేపు మ్రాన్పడియుండి యెట్టకే నామంచము దిగి సిగ్గుచేత తలలువాల్చి కొని నిలుచుంటిమి. అప్పుడా బ్రాహ్మణుడు దూర్వాసునివలె మండిపడి కన్ను లెర్ర జేసి దంతములు పటపట గొరుకుచు గటములదర నుత్కటకముగా మమ్ముదూరెను. గాని అవియేమియు భయకంపితులమైనమాకు వినంబడినవికావు.

ఆడుదానిసాహస మెట్టిదో చూడుము. వీరభద్రునివలె నహంకార మావేశించి తిట్టుచున్న యావిప్రుని పాదములం బడి యప్పడతి నాథా! ఈ తప్పు నాదిగాని మదనునిది కాదు. నాదుర్బోధచేతనే యాతం డిందులకు సమ్మతించెను. వానికిజేయుశిక్ష నాకు విధింపుము. ఆడుపుట్టుకయే తప్పుగలది. అట్టివారు తప్పుచేసినప్పుడు మగవాండ్రు సైరింపకున్న నే నేమి సేయనగును. గురుడంతవాడు తనచేడియం బాడిదప్పినదని నిరసింపక దేవతలసన్నిధి స్వీకరింపలేదా? సకలశాస్త్రజ్ఞులైన మీ రెఱుంగనిది గలదే? స్త్రీస్వభావమును గురించి కవిశిఖామణియగు కొక్కోకుడు వ్రాసినది జ్ఞాపకము దెచ్చుకొనుడు.

శ్లో॥ ఉజ్వలవపుషంపురుషంకాయమతే స్త్రీవరోపితాం దృష్ట్వా
     అనయోరేషవిశేషస్త్రీకాంక్షతి ధర్మనరపేక్షా॥
     భృశమసురాగఃపత్యావపత్య వాత్సల్యమతివయస్స్త్వంచ
     వ్యతికరనిర్వేదిత్వం ధర్మాపేక్షావ్యస్తి నకస్యాశ్చిత్॥