పుట:కాశీమజిలీకథలు -02.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

కాశీమజిలీకథలు - రెండవభాగము

మిక్కిలి పొడవగు నక్కానలో నమ్మానవతిని వెదకుచుండ నారుమాసములు గతించినవి. అప్పు డతండు విసిగి యా చిన్నది చెప్పిన కొండకు గురుతుగా బోయెను. అప్పర్వతశిఖరమెక్కి యక్కలికి చెప్పిన చిహ్నంబులన్నియు నరయుచు నెట్టకేలకు నాపుస్తకమును గనిపెట్టెను. అది యందుకొని యందులోని విశేషములన్నియు జదివి యౌరా! విశ్వకర్మసృష్టికాని యది మానవసృష్టి కాదు. ఇట్టికోటలు గలిగినచో శత్రువులేమి చేయగలరు ధైర్యమాపలేక విశాలాక్షి పారిపోయినది గాని దానిలో జెప్పినట్లుందుండి నడిపించినచో బ్రపంచమంతయు నేకమైవచ్చినను నేమియు జేయలేదు. అన్నన్నా! ఇట్టికోటను గూడ శత్రువులుబట్టుకొనిరే. దైవగతి యసాధ్యమైనదిగదా? అని పెక్కువిధముల దర్కింపుచు నాపుస్తకమునం దున్నరీతి నాతలుపు తెరచి యాబిలమునుజూచి వాని విశేషములకు వెరగందుచు గొంతదూరము పోయెను.

ఇప్పుడు నేను బోయినను లాభ మేమియులేదు. విశాలాక్షి యీద్వారమున గోటలోనికి బోవన ట్లాపుస్తకమే చెప్పుచున్నది. అట్లేగివున్న నీపుస్తక మిందుంచదు. అచ్పేడియ బైటనెక్కడనో యున్నది కావున నేనిప్పటికి మరలి యత్తలిరుబోడింగలిసికొని పిమ్మట నీ బిలమార్గంబున బోయి పగరం బరిమార్చెదనని నిశ్చయించి యందుండి మరలబైటికివచ్చి యాతలుపుమూసి యాపుస్తకమును బుచ్చుకొని కొండదిగెను.

తురగమెక్కు పాటవముగల యప్పాటలగంధి యింతదనుక నియ్యటవిలో నేమిటికై యుండును. ఈపాటి కెవ్వీటికైనం జేరకమానదు. కావున నిక నీకానలో నరయుటమాని పురంబులకుబోయి వెదకెదను. విశాలాక్షి మగడైనను విపినమం దేటికి యుండును. తెలియక నిన్నా ళ్ళూరక యలసితిని. వారిరువురం గూర్చి కాని యింటికి బోనని మొదటనే శపథము చేసితినిగదా? వారు బ్రతికియుండినచో నెప్పటికైనను గూర్పక మానను. వారు సజీవులై యున్నందులకు మదీయమానసంబే తార్కాణము. అని తలంచుచు నయ్యరణ్యమార్గము విడిచి గ్రామములమీదుగా నడువజొచ్చెను. ప్రతి గ్రామమునకు దప్పక పోయి వారిజాడ నరయుచుండ మరియు నారుమాసములైనది. అదివరకెన్నడును గనివిని యెఱుగని యొకవిదేశమార్గంబునం బడి పోవుచుండ నాదారి యొకనాటి సాయంకాలమున కొకపట్టణము దాపునకు దీసికొనిపోయినది. అం దొకపురుషుం డెదురుపడిన వాని కింద్రద్యుమ్నుం డిట్లనియె.