పుట:కాశీమజిలీకథలు -02.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

కాశీమజిలీకథలు - రెండవభాగము

దరు. నన్ను విమర్శించి చూచుటకు కారణ మెద్దియేనిం గలదా యని యడిగిన నవ్విప్రుండు వానితో నిట్లనియె.

అయ్యా! మా కాపురము మాళవదేశరాజధానియైన కోశాంబి యను పట్టణము. నేను తద్దేశ ప్రభువైన ధర్మపాలుని పురోహితుడను నా పేరు విష్ణుశర్మయందురు. మా రాజు కొన్ని సంవత్సరముల క్రిందట శత్రువులచే నోడింపబడి బద్దుండగుటచే నప్పట్టణమును శాతృవులాక్రమించిరి. నేను మిగుల పండితుండను. నాకు బెద్దకుటుంబము గలదు. ఆ క్రొత్తరాజు మిగుల దుర్మార్గుడగుటచే ధర్మపాలునియందుగల విరోధమునుబట్టి నాకతం డంతకుమున్ను పారితోషికముగా నిచ్చిన ధనకనకవస్తువాహనాదిక మంతయు గొల్లపెట్టుటయే గాక నన్ను గుటుంబముతో గూడ నాయూరినుండి లేవగొట్టెను. పిమ్మట నేనచ్చట రక్షకులు లేమింజేసి మిక్కిలి పరితపించుచు నతికష్టముతో నాయూరు విడిచి కుటుంబముతోగూడ దేశాటనము చేయ మొదలు పెట్టితిని. కుటుంబము పెద్దదగుటచే నెచ్చటికి బోయినను గడుచుట కష్టముగా నున్నది. ధర్మస్వరూపుడైన యదృష్టదీపమహారాజుగారి ఖ్యాతిని విని యాయన దర్శనమైనచో నీ దరిద్రము వాయు నను తాత్పర్యముతో నీయూరువచ్చి యీ సత్రములో బ్రవేశించితిమి. భోజనమున కేలోపములేదు. ఎన్నిదినము లున్నను పొమ్మనరట. ఇదియు గొంతమేలేయని యిందు వసించియుంటిమి. ఆయన తీర్థయాత్రకు వెడలెననిం వదంతిగానున్నది. ఏ తీర్థ మందున్నదియు దెలియదు. బ్రాహ్మణులందరు ప్రతితీర్థమునందు వేచియున్నారు. అమ్మహానుభావుని దర్శనమైన వానికి దరిద్రముండదు. వాడు కుబేరునంతవాడగును. అతని యీవి యింతింతని పొగడుట శక్యములేదు. ఎప్పటికేని యప్పుణ్యాత్ముని దర్శనము కాకపోవునాయని యాసతో నున్నాడను ఇదియే నా వృత్తాంతము. మరియు మీ మొగముచూడ మా ధర్మపాలుని మొగముపోలిక యగుపడుచున్నది దానంజేసి నిరూపించి చూచితినని చెప్పగా నదృష్టదీపుం డిట్లనియె.

అయ్యా! మీ రాజుగారి నోడించి బద్దుజేసిన రాజు పేరేమి? మీ ధర్మపాలునికి భార్యాపుత్రులుకలరా? యుండిన వారేమైరని యడుగగా నతండు ఆర్యా! మా పట్టణము ముట్టడించిన రాజు చోళదేశ ప్రభువైన సురక్షితుడు. అతడు కపటముచేసి మా రాజు నోడించెను. అదియు పెద్దమంత్రియైన విహారభద్రుని మూలమున వచ్చినది. మా రాజుగారిభార్య సునందయను సుందరి గర్భభరాలసయై మూడేండ్లప్రాయముగల పుత్రు నెత్తుకొని యాయుద్ధములోనే నెచ్చటికో పారిపోయినది. నాటినుండియు నామెజాడ యేమియుం దెలియకున్నది. వసురక్షితునివంటి దుర్మార్గు డీలోకములో నెచ్చటను లేడని కొంతసేపతని క్రూరకృత్యములు జెప్పదొడంగెను. అదృష్టదీపుడా బ్రాహ్మణుని వచనంబులు విని యించుక శంకించుకొనుచు నాకాలప్రమాణము వారివారి నామములు వ్రాసికొని గుత్తముగా నుంచుకొనియెను.