పుట:కాశీమజిలీకథలు -02.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

కాశీమజిలీకథలు - రెండవభాగము

ఎంత మహారాజయినను అంతద్రవ్యము నొక దినములో పంచి పెట్టుటకు సమ్మతించునా! అప్పటికి నదృష్టదీపునికి బదునెనిమిదేడుల ప్రాయమువచ్చినది. అంత దనరూపము జూచుకొని యాగోపకుల కంటె మిక్కిలి వ్యత్యయముగా నుండుటచే ననుమానము జెందుచు నొకనాడు తనకు గథలు చెప్పుచుండెడి ముసలిదాని యొద్దను బోయి మెల్లన నిట్లనియె అవ్వా! నీవు నాకు జెప్పెడికథలచే లోకమేమియు జూడకున్నను జూచినట్లె పొడగట్టుచున్నది మరియు నొకసారి దేశముగూడ జూడవలయునని యభిలాష గలుగుచున్నది. ఒక్కొక్కటి యడిగెదను. రహస్యమైనను దాచక చెప్పవలయును. నేను పుట్టిన దినము, ప్రదేశము దెలిసికొన నవసరమై యున్నది. ఎవ్వరినడిగినను జెప్పిరి కారు. నీవు పెద్దదానవు. నీకు జ్ఞాపకముండక మానదు. నీకు నాయందు మొదటనుండియు నక్కటితము పెంపుగదా? యని పలుకగా నదివిని యోహో! యితండక్కటిజము పెంపుగదా యనుచున్నవాడు పెంపుసంగతి తెలిసినది కాబోలు. నిక నేను మాత్రము దాచనేల? నా కొడుకు వీనితో నా సంగతి చెప్పవలదని బోధించెనుగాని దీనంజెడిపోయిన దేమున్నది.

అని నిశ్చయించుకొనుచు బాబూ! నీవు మా యింట బుట్టలేదు. మా పిల్లవాండ్రందరు నడవికి బోగా నచ్చట నొక మర్రిచెట్టు క్రింద బాముగరచి యొకస్త్రీ చచ్చియున్నదట. ఆమె ప్రక్కలో నీవు దాని లేపుచు నేడ్చుచుంటివట. ఆపాము నిన్ను గరువక సర్పమునెత్తి నెత్తిమీద గొడుగుగా బట్టుచున్నదట. అదిచూచి బాలకులా యురగమును బెదిరించుచు నిన్నెత్తుకొని మాయూరిలోనికి దీసికొనివచ్చిరి. మాపింగళకు డదివిని యపుత్రుకుడుగావున నిన్నింట బెట్టుకొని పెంచుకొనుచుండెను. అప్పటికి నీకు మూడు సంవత్సరములు ప్రాయముండును. ఇప్పటికి పదునైదు సంవత్సరములు దాటినవి. దీనింబట్టి యూహించు కొనుమని జరిగిన వృత్తాంతమంతయుం జెప్పినది. చేతగాసులేక జగమంతయు దనకీర్తి వ్యాపింపజేసినదిట్ట యొక గొల్ దానియొద్దనుండి రహస్యము తెలిసికొనుట యేమియాశ్చర్యము.

అదృష్టదీపుడట్టి మాటలు విని మిగుల విచారింపుచు నయ్యో! పాముగరచిచచ్చినది మా తల్లికాబోలు. నన్ను దీసుకుని యొంటరిగానడవికి వచ్చుటకు గారణమేదియో గదా! మా తండ్రి యేమయిపోయినో? యే కులమువారో నాకు మరి యెవ్వరేని బంధువులు గలిగి యుందురేమో యీవిషయము నాకెట్లు దెలియును. దేశములన్నియు దిరుగుచుండ నెప్పటికేని తెలియక మానునా? కూపస్థకూర్మమువలె నీ యడవిలో నుండనేల నొకసారి యెట్లయినను దేశయాత్ర చేయుటయే యుచితమని తలంచి తన కత్యంతమిత్రుడయిన బలభద్రుడను వానితో జెప్పి యింతకుమున్ను కానుకలుగా వచ్చిన గుఱ్ఱములలో నుత్తమమయినదాని దాచికొని యుండుటచే నొకనా డెవ్వరికిని దెలియకుండ బలభద్రునితో నడవికి బోయినట్లే పోయి యా గుఱ్ఱమెక్కి యొక మార్గమునంబడి బోయెను.