పుట:కాశీమజిలీకథలు -02.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

కాశీమజిలీకథలు - రెండవభాగము

పుణ్యాత్ముడను. నాకీ స్వర్గదర్శనంబు తొలుత స్వామిదయవలన లభించినది ఇప్పుడు మీదయవలన లభించినది. నన్నిచ్చటికి రప్పించిన కారణమేమియో యానతీయుడని వినయముగా బ్రార్థించితిని.

నా మాటనకు వెఱగందుచు బృహస్పతి వెండియు నిట్లనియె. రుచికా! నీవు మొదట స్వర్గమునకు నెట్లు వచ్చితివి ఎచ్చ టెచ్చట గ్రుమ్మరితివి ఇందెవ్వరిని గంటివి. నిక్కము వక్కాణింపుము. నీకు బారితోషికం బిప్పింతునని పలుకగా నే నిట్లంటి అయ్యా! నా వృత్తాంతమంతయుం జెప్పెదవినుండు. అసత్యమాడ నా కేమియు నవసరములేదు. మాతండ్రి బలదేవుడు. శ్రీజగన్నాథంబున వసియించి పూవుదండలు గట్టి స్వామి కర్పింపుచు సర్వదా యతని ధ్యానించుచు బరమభక్తుడై కాలము గడుపుచుండెను. మాతల్లి పుత్రలేమిం జేసి యొకనాడు తన్ను బుత్రులకై మిక్కిలి వేధించిన స్వామినారాధించి యాయవసరంబున నన్నుగనియె నన్ను మిక్కిలి గారాముగా బెనుచుచుండగా నేను గ్రమంబున బదియారేడుల ప్రాయముగలవాడనైతిని. అప్పుడు మాతండ్రి నాకు బెండ్లి చేయవలయునని ప్రయత్నము చేయుచుండెను. అంతకుపూర్వ మొకనాడు పురాణము చెప్పుచుండ స్వర్గవిశేషములన్నియు విని యున్నవాడ గావున నేను దేవకన్యకలను గాని మానవకన్యకలను బెండ్లియాడునని మా తండ్రితో జెప్పితిని.

అతండు నన్ను మందలింపుచు నోహో! నీ మాటలు మిగుల జిత్రములుగా నున్నవే మానవులకు మానవుడుగాక దేవతలెట్లు లభ్యమగుదురు. స్వర్గము లోకాంతరమే! మనకు బోవుటకైన శక్యముకాదు. నీ వెరుగక యిట్టిమాట పలుకు చున్నవాడవు. నీకు మనుష్యకాంతలలో జక్కనిదాని నరసి పెండ్లిజేసెద బెండ్లి యాడుమని యెంతయో బోధించెను. నేను మాతండ్రి మాటలకు సమ్మతింపక నాయనా! నీవేమి చెప్పినను సరిపడదు. మనుష్యకాంతలలో శాస్త్రసిద్ధమైన సౌందర్యము గలవారే లేరు. ఉండినను విద్య యుండదు. అదియు గలిగినను శీలము సున్న. ఇన్నియుం గలిగినను నస్థిర యౌవనలుగదా? దేవకన్యల కీదుర్గుణము లేవియుం గలిగియుండవు. పెండ్లియాడిన వేల్పు చేదియనే బెండ్లియాడవలయు లేకున్న బ్రహ్మచారిగా నుండ వలయుగాని యీ మానవనీచజాతి పొలతులం గైకొనుటకంటె హైన్యమున్నదా (ఏకానారీసుందరీనా దరీనా) ఉండిన మంచిసుందరియగు భార్యగలుగవలయు లేనిచో నడవులలో గుహలోనుండుట శ్రేయము. నావివాహ విషయమై నీవేమియు బ్రయత్నింప వద్దు నీసుద్దులేమియు నేను వినువాడను గానని నిస్సంశయముగా బలికితిని.