పుట:కాశీమజిలీకథలు -01.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

దర్శనవ్యగ్రచిత్తుఁడై మనంబునఁగల తొందర నడకయందుఁ గాన్పింప మొదటి మజిలీ చేరెను.

అట్లు చేరి యొకసత్రంబున బసచేసి మౌనంబు విడచి గొల్లవానిఁ జీరి నేనిందు పాకంబు సేసెద సామగ్రి యంతయు నుండెంగాని ఆకులును కట్టెలును గొరంతగా నున్నవి. ఇది యరణ్యప్రాంతము. ఈయూరిబైటనే యవి లభ్యమగును. సరగ నఱిగి సంగ్రహించి రమ్మని చెప్ప వాడరణ్యవాసి యగుట వెరువక యొక్కరుఁడ చని కొన్నికట్టెలం గొట్టి యాకులం గోసి మోపుగట్టి యెత్తుకొనునంతలోఁ బైకిఁ దలయెత్తి చూడఁగా భూమికి నేత్రగోచరమైనయంతదూరములో నొకకీలురథ మరుగుచుండుటఁ జూచి వెరఁగంది యోహో! యిది యేమి వింత! ఈ బండి భూమినంటకయే యరుగుచున్నయది. దీనిచంద మెట్టిదో మనయయ్యవారి నడిగి తెలిసికొనియెదంగాక యని వేగిరముగా నామోపు శిరమునఁబూని యింటి కరిగి యామోపు దింపకయే అయ్యగారూ! అయ్యగారూ! అని యరచెను. ఆ స్వాములవారు మడిగట్టుకొని యితరజాతులతో మాట్లాడరు వాఁ డెంతబిగ్గరగా నరచినను ప్రతివచన మియ్యకపోవుటచే వానికి మిగులకోపము వచ్చినది. మోపు దింపి యీకేకకు మాట్లాడకున్న నిప్పుడే యింటికి బోవుచున్నవాఁడనని మరలఁ బెద్దయెలుగున బిలిచిన నాతపస్వి యదరిపడి వాకిటకు వచ్చి హస్తసంజ్ఞతో నిప్పుడు మాటాడను భోజనమైన వెనుక మాట్లాడెదనని సూచించుచు వాఁడు తెచ్చిన కట్టెలును ఆకులునుం దీసికొని వేగముగా వంటఁజేసి భుజించిన వెనుక నీవలకు వచ్చి గోపాలుని నన్నమునకుఁ బిలిచెను. వాఁడు నేనొక విచిత్రమైన విషయము జూచితిని. దాని పూర్వోత్తర మెట్టిదో చెప్పినంగాని భుజింపననిన నా యతియు వత్సా! భుజింపుము. పిమ్మట స్థిరముగాఁ గూర్చుండి నీయడిగిన దానికింగల కారణంబులు చెప్పెదనని యెట్టకేలకు వాని నొడంబరచి యన్నముబెట్టి భుజించిన వెనుక యొకరమ్యమైనప్రదేశమున వసించి వానిం బిలిచి గోపా! నీవు చూచిన విశేష మెద్దియో చెప్పుమనుటయు వాఁ డిట్లనియె.

అయ్యా! నే నాకులకై పొలమున కరిగినప్పు డొకబండి యాకాసమార్గమునఁ బోవుచున్నది. అందుఁ గొందఱుపురుషులు స్త్రీలతో వినోదముగా మాట్లాడుచున్నట్లు గూడ వినిపించినది. ఇది కడుచిత్రము. దాని వృత్తాంత మెట్టిదో యెరింగింపుఁ డనిన నయ్యతియు దనకు సన్యాసి యిచ్చిన మాణిక్యమును ముందిడుకొని పూజించినంత నమ్మణిప్రకాశంబున నావృత్తాంత మంతయు గరతలామలకముగాఁ బొడగట్టుటయు నద్భుతపడి యతఁడు వానితో నిట్లనియె.

గోపా! నీవు శౌనకమహర్షివోలె బహుకథాశ్రవణకుతూహలుండవు. కావున