పుట:కాశీమజిలీకథలు-12.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనంగమోహిని కథ

21

నంది మూర్చబడియుండెననియును, వానికి స్వస్థత గలిగిన పిదప వాని వృత్తాంతము వినవచ్చుననియు, గుతూహలపడుచు, శేష వాసుకులతో మరియు నిట్లనియె.

మిత్రులారా ! వీడు సౌధాగ్రమునఁ బడుటచే నీలోకమునకు మీదుగా నున్న భూతలమునుండియే యిందు పడినట్లు తెల్లమగుచున్నది. పాతాళవాసులు మర్త్య లోకమున కేగ బహిష్కరింపఁబడినప్పుడు వీఁడచ్చటి కేగుట కెద్దియో చెడ్డపనియే మూలమని తోచుచున్నది. వాసుకి తనయను రక్కసుఁడే గదా యపహరించుకొని పోయెను. అయ్యబలను దుష్టబుద్ధియై వీఁడు మనుజలోకమునకుఁ గొనిపోయి యందు పరాభవింపఁబడి యుండిన నుండవచ్చును. వీనికించుక స్పృహగలిగినతోడనే వీనివలన విశేషము లెరుంగవచ్చును. అంతదనుక మీరిందేయుండుడని చెప్పి శేషవాసుకులఁ దన యింట నాపుజేసెను. కుంభుని వర్తమాన మెప్పటికప్పుడు వచ్చి తనకుఁ జెప్పుచుండు టకుఁ దగినవారిని నియోగించి యా దైత్యేంద్రుండు మిత్రులతో నిష్టగోష్టీ వినో దంబులఁ గాలముఁ గడపుచు వారికించుక మనశ్శాంతిని గలుగఁజేయుచుండెను.

304 వ మజిలీ

మణిగ్రీవజలంధరులకథ

అలకాపురంబునఁ గుబేరుని సన్నిహితుఁడైన చిత్రకేతునకు మణిగ్రీవుండను గమారుండును గుణవతియను బుత్రికయును గలరు. మణిగ్రీవుఁడు బిన్ననాటగోలె యవినయాహంకార గర్వభూయిష్టుండై తల్లిదండ్రులమాట వినక విలాసంబుగాఁ గాలంబు గడుపుచుండెను. వానికి జల౦ధరుండను నాంతరంగిక సచివుండుగలఁడు. వారిరువురు నాహార శయ్యా విహారములయందు నేకదేహ మెట్లట్ల వర్తించుచు నత్యంత మైత్రితో జెలంగియుండిరి. ఇర్వురకు హేమావతియను నొక్కయచ్చరలేమ భోగ భామి‌నియై యుండెను. ఆసచివద్వయం బాయచ్చర మచ్చకంటితో ముచ్చటగా సంతత క్రీడావినోదంబుల బ్రొద్దుపుచ్చుచు దరుచు విమానయానంబున లోకాంతరంబుల కరిగి యందందుగల సుందరశైల శిఖరంబుల విలాసవిహారంబు లొనరించుచుందురు.

వారొకనాఁడు దివోదాసుని శాసనమును మన్నింపక భూలోకంబునకరిగి యందు శీతశైలశిఖరంబునఁ గ్రీడింపసాగిరి.


సీ. ఒక కేలు నొకఁడు మరొక్కఁడింకొక కేలు
           బట్టి ప్రేయసిదోడఁ బరిఢవించి