పుట:కాశీమజిలీకథలు-06.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్వవంతుని కథ

99


డెబ్బది యొకటవ మజిలీ.

సత్వవంతుని కథ

దూరమునందుండిన కొండలోయనుండి జలపూరితమగు వెదురుబొంగు భుజంబున నిడికొని లోపల కైపారు మెకంబుల యర్పులు వినుచుఁ గేసరుఁడను బిల్లుఁ డల్లంత ప్రొద్దువేళ నాదారిఁ బోవుచుఁ బిపాసాపీడితుఁడైయున్న మకరాంకుని జూచి వెరఁగుపడుచు బాలుఁడా ! నీ నెవ్వండ వేమిటికిట్లు పడియుంటివని యడిగెను. ఆ ధ్వనివిని తన సఖురాలు దాహ మిచ్చుచున్నదని తలంచి యా మకరాంకుండు కన్నులం దెరువకయే నోరుఁ దెరచెను. అప్పుడా కిరాతవరుం డాసంజ్ఞ గ్రహించి వెదురుబొంగు చీలదీఁసి మొగమున నీళ్ళుఁజల్లి ధారగా నోఁటిలోఁ బోసెను. చల్లని యా తోయముఁ గడుపునిండాద్రావి మేనంతయుఁ జల్లఁబడి చెమ్మటలు గ్రమ్మఁ గన్నుల నులిమికొనుచు మకరాంకుఁడు మెల్లగా లేచి కూర్చుండెను.

సుకుమారుఁడా ! నీ వీ మహారణ్యమున కొక్కరుడ నెట్లువచ్చితివి ? నీ విందేల పడియుంటివి ? నీ పేరేమిటి ? యని యడిగిన మకరాంకుఁడు పుణ్యాత్మా ! నేఁడు నీవు నాకుఁ బ్రాణదానముఁ గావించితివి. మే మిద్దరము బ్రాహ్మణ కుమారులము. స్వదేశమునకుఁ బోవుచుఁ దెలియక నీ దారిం బడితిమి. నన్ను వరాహము తరిమిన నేలంబడి మూర్చిల్లి తిని. నా స్నేహితుఁడు నాకు దాహముఁ దేఁబోయెను. ఈ యరణ్యమున నతండెందుఁ జిక్కు పడియెనో తెలియదు ఇదియే నా వృత్తాంతము. ఆకారణ బంధుండనై జీవనమిచ్చిన నీ కులశీల నామంబులు వినఁ గోరెద నుడువుమని పలికిన నతండు నవ్వుచు నిట్లనియె.

అయ్యా ! నీకు నేనేమి యుపకారము సేసితినని నన్నింతగాఁ గైవారము సేసెదవు? నేను బోయవాఁడను. మా పట్టణ మీ ప్రాంతమందే యున్నది. నా పేరు కాసరు డందురు. పొద్దు వాలుచున్నది. ఒక్కడ విందుండలేవు. నావెంట మా యింటికిరమ్ము రేపు దారిఁజూపి యం పెదనని చెప్పిన సంతసించుచు మకరాంకు డప్పుడు నేదియుఁ గర్తవ్యము తెలియక యక్కిరాతునివెంట బిల్ల పల్లి కరిగెను. శరభ శార్దూలాది మహాసత్వంబుల కృత్తి విశేషంబుల బటంబులుగను గటంబులుగను వితానంబులుగను జేసికొనుచు మృగప్రధాన కరణకీకసంబుల సుపకరణంబులుగా నొప్పార ఫల దర కుసుమ కిసలయాదికములు రవణములుగా ధరించి చెంచు మించుబోణు లందంద యొయ్యారముసూప సింహ నఖర విదళిత గజదండ ఫలితంబులగు మొత్తంబులతో నత్తించినఁ గురువింద పూసల పేరు లరుతమెరయ నాడుకొను డిలధికులచే శోబిల్లు బిల్ల పల్లెంజూచి యతం డొక్కింత సంతసముతో నిట్లు దలంచెను.

ఆహా ! యీ కిరాతు లవక్రవిక్రమశాలురై నను విద్యాబుద్ధిబలసూన్యులగుట