పుట:కాశీమజిలీకథలు-06.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శశాంకమకరాంకుల కథ

95

యనుగ్రహించి యొక పాత్రతో జల మిప్పింతురేని తీసికొనిపోయి మిత్రుం బ్రతికించుకొనియెద. రక్షింపుడు. రక్షింపుఁడు అని దీనముఖముతోఁ బ్రార్థించెను.

దయాహృదయుండగు నజ్జనపతి యా మాటలువిని జాలివొడమ శశాంకా ! నీ మిత్రుఁడు బ్రతుకఁడని చెప్పుచున్నావు. నీ మొగముఁ జూడ నీ యలసట ప్రమాదము చేయునట్లు తోచుచున్నది. ముందు జలములం గ్రోలి యాహారమునఁ దృప్తుండవై విశ్రమింపుము. నీ సఖుని దూతలంబుచ్చి రప్పించెదనని చెప్పిన సమ్మతింపక దేవా ! ప్రాణములైన విడుతునుగాని నా మిత్రుని దప్పి తీర్పక నే నాహారముఁ గొను వాఁడనుకాను. అయ్యో ! ఆ తా విచ్చటికిఁ జాల దవ్వున్నది. ఎప్పుడు పోపుదును. ఎప్పుడు వానినిం జూతును. మరల నాతఁడు నా కన్నులం బడునా ? అని పలవరింపుచు నాలుక యెండ, మాటరాకఁ దప్పిగొని నేలంబడి మూర్చిల్లెను.

అప్పు డా నరపతి పరితపించుచు నతని దనశయ్యపైఁ బరుండబెట్టించి శైత్యోపచారము లెన్ని యేని గావించుచు జంబీరరసమిశ్రితమైన తక్రసారంబు బలవంతమున నోట పట్టించి విశ్రాంతికలుగఁ జేసెను. మరియు నాచేత నిరువుర వారు వపురౌతులకుఁ బానియపాత్రముల నిప్పించి శశాంకుఁ డెరింగించిన గురుతులుచెప్పి యా మకరాంకుని సేదఁదీర్చి యిచ్చటికిఁ దీసికొనిరండని నియమించుటయు వా రతి జవంబున నరిగి యయ్యరణ్యంబంతయుం దిరిగి యెందును నా మకరాంకునిజాడఁ గానక విసిగి మరల సంజవేళకు గుడారములయొద్ద కరుదెంచి యా వార్త భూభర్త కెరింగించిరి.

కిన్నరదత్తుం డుత్తలమందు చిత్తముతో మంత్రిసత్తములం గాంచి యిట్లనియె. అమాత్యులారా ! ఈ భూసురకుమారుండు కడు సుకుమారుండువలె గనంబడుచున్నవాఁడు. ఎంతసేదఁదేర్చినను దెలివిఁ జెందకున్నవాఁడు. వైద్యులు పరీక్షించి వీఁడు జాలదినములనుండి నిద్రాహారములు లేక బడలియున్నాడనియు నింక రెండు మూడు దినములవరకుఁ దెలివిఁ జెందఁడనియుఁ జెప్పిరి. ఈతఁ డత్యంత గుణసంపన్నుండని వానిమాటలే చెప్పుచున్నవి. ప్రాణము పోవుచున్నను మిత్రుని నిమిత్తము దాహముఁ గ్రోలఁదయ్యెగదా ! ఇంతకన్న సౌశీల్యమేమియున్నది? వీనియందు నాకెంతేని యక్కటికము గలుగుచున్నది. వీని మనవీటికిఁ దీసికొనిపోయి యున్నత దశ నొందించెద. వీఁ డనినట్లు మకరాంకుఁడు క్రూరసత్వంబుల పాలయ్యెనని తోచెడిని. వీని కాతెరఁ గెరింగింపరాదు. ఈతఁడు మిత్రుని నిమిత్తము ప్రాణములు విడువఁగలఁడు. ఉత్తముని లక్షణము లవియే కదా యని పలుకుచు నాఁటిరాత్రి పయనము బోవుటకు యాజ్ఞాపించి కుదుపుఁ జెందకుండఁ దా నెక్కి వచ్చిన యందలముపై


బరుండఁబెట్టి దీసికొనిరమ్మని నియమించి తాను దురగారూడుండై బయలు వెడలెను.

నాఁటి వేకువజామునఁ జతురంగబలముతోఁ బయలుదేరి యజ్ఞనపతి కతిపయ