పుట:కాశీమజిలీకథలు-06.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

కూలుండే లభించెను. ప్రాయమునకు మించిన విద్యయున్నది. కొంచెము కోపశీలుండని మాత్రము వింటిమి. బ్రాహ్మణులకు సంపదవిషయమై యరయవలసినపనిలేదు. వివాహముహూర్తము నేటికిఁ బదిదినము లున్నది అని చెప్పెను.

కళా — (ఆమాటవిని రాజపుత్రిక నవ్వుచు) ఆర్యవర్యా ! ఇది ఏమి విపరీతము? శీలవతికిఁ బ్రాయమురానిదే వివాహము సేయబూనితిరేల?

యజ్ఞదత్తుఁడు — అమ్మా ! విప్రఁకన్యకకు సిగ్గుతెలియకమున్నే పెండ్లి చేయవలయునని ధర్మశాస్త్రజ్ఞులు వ్రాసియున్నారు. దానికి మనమేమి చేయుదుము?

కళావతి - తండ్రీ ! ధర్మశాస్త్రకారకులగు మునులు సన్యాసులగుట నట్లు వ్రాసిరి. కానిచో ఎన్నఁడో యౌనము వచ్చునని ముందే పెండ్లి చేయవలయునని ఏల నిరూపింతురు. అందలి ప్రమాదములు వారూహింపరైరి. వృద్ధులకు బుద్ధిజాడ్యము గలిగియుండును గదా. అందులకు వారేమికారణము వ్రాసిరో మీరూహించితిరా ?

యజ్ఞ :- పుత్రీ ! వినుము. కన్యలకుఁ బదియేండ్లు దాటినతోడనే శృంగార చేష్ట లుత్పన్నము లగుచుండును. ఆ లోపలఁ బతి నిరూపణము కానిచోఁ గనుల కింపైన యతనిం జూచినప్పు డీతండు పతియైన లెస్సయగుంగదాయని తలంచుచు మనసును వ్యభిచరింపంజేయును. దానంజేసి కన్యాత్వహాని కాగలదు. అప్పటికిఁ బెండ్లి యాడియుండినచో నట్టి యభిలాష వహించుట కవకాశముండదుగదా. అందులకే సర్వజ్ఞులైన మహర్షులట్లు వ్రాసియున్నారు. అట్టివారిని సన్యాసులని నిందించితివి. గదా?

రాజపుత్రి :- తండ్రీ ! యౌవనమందుఁ బరిణయంబగు తరుణులందరు మనసుచే వ్యభిచరించినవారేనా? దమయంతి, సీత మొదలగు మగువలు బాల్యమునందే వివాహమాడిరా ? వారి పాతివ్రత్యమున కేమి లోపమువచ్చినది.

యజ్ఞదత్తుఁడు :- బాగుబాగు లోతుప్రశ్న వేయుచున్నావుగదా ! అందులకేకాదా క్షత్రియకన్యకలు యౌవనవంతులగునంత నితరపురుషులం జూడకుండ నంతఃపురములఁ గాపాడుచుందురు. బ్రాహ్మణస్త్రీల కట్టి రక్షణము గలుగుట దుర్ఘటము కావునఁ దొలుతనే వివాహము సేయుచుందురు. అదియునుంగాక మంత్ర పూతంబైన హవిస్సు భరింప వైదిశాగ్నియుంబోలె. గర్మిష్టులగు బ్రాహ్మణుల తేజంబు భరింప విప్రకన్యక యతి నిర్మలంబై యుండవలయును. లేనిచో తత్సంతతి కా దోషంబు సంక్రమించెడిని పరిశుభ్ర వస్త్రంబున నణువు సోకినను బెల్ల మగుంగదా.

రాజపుత్రి :- గురువరా ! భూభరణ సమర్థుండగు నరపతి జనించుటకు మాత్రము క్షేత్రం బతిపవిత్రంబై యుండవలదా ?

యజ్ఞ :- ఉండవలదని యెవ్వరనిరి. అయినను దపంబుననకుఁగల నియమంబు పాలనంబున కవసరములేదు.

రాజుపుత్రి :- అట్లయిన వైశ్యులకు నియమమేల గలుగవలయు ?