పుట:కాశీమజిలీకథలు-06.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

అని యెరింగించు వరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి కథ తదనంతరా వనిధంబున నిట్లని చెప్పఁదొడంగెను.

అరువది మూడవ మజిలీ.

ఆహా ! ఈజగంబెంత మోహక్రాంతమై యున్నదో ? భగవంతు డైంద్రజాలికుండై తృణము మేరువునుగాను మేరువును తృణముగాను జేయుచుండును. అది యెరుంగక జనుండు స్వతంత్రుండువోలె నెల్ల కార్యములకుఁ బూనుకొను చుండును. అంతకన్న యవివేకము లేదు. వచ్చునది వలదన్నను రాకమానదు రానిది యెంతప్రయత్నముఁ జేసినను రానేరదు. అట్టి నిశ్చయముగలవానికి విచారము గలుగదు. వగపు బొడమదు దుఃఖము జనింపదు. అది లేకయేకదా నే నిన్నిదినములు పడరానియిడుముల బడుచుంటిని. నా రాజ్యం బన్యాధీనముకానిధి నారూపించియుండ నే నాపగలనా ? అక్కటా ! సంపద్విహీనునిఁ జూచి మిత్రులును జులకనగాఁ జూతురు గదా? రాజ్యనష్టానంతరమున సహాయులగుదురను తలంపుతో నాప్తులని నమ్మి నిజం బెరింగించిన యాభూపతు నెంత దేలికగా మాటాడిరి. కానిమ్ము. అప్పుడే నా రాజ్యము పోయినదాయేమి ? స్వయం ప్రభాదేవి యాలయములోని యతీశ్వరుఁ డభయ ప్రదాన మిచ్చియుండలేదా? అనుడి యేలఁదప్పును. అని తలంచుచు నింద్రమిత్రుఁ డొకనాఁడు సాయంకాల మశ్వారూఢుండై రత్నగిరి ప్రాంతము మీఁదుగాఁ దన పట్టణమునకు వచ్చుచుండెను.

అప్పు డిరువురుదూత లమాత్య ప్రేషితులై వడివడి పరువిడి వచ్చుచు నా రాజమార్తాండుని జోహారుచేసి దేవా ! ఆరత్నహారము రాజపుత్రికమెడలో వచ్చి చేరినది. అమాత్యులు మీకిట్లు విన్నపము సేయుమని రని చెప్పినతోడనే యా భూపతి యపరిమితా నందముతో గుఱ్ఱము డిగ్గనురికి యెట్టెటూ ! మరలఁ జెప్పుడు. మీరన్నమాట సత్యమగుంగాకయని యడిగిన నా కింకరు లిట్లనిరి. రేడా ! మేము దేవరయానతి దేశములెల్ల దిరిగి తిరిగి పురముల కరిగి యరిగి పల్లెలు చుచిచూచి తెరవుల నరసి యరసి యొకనాఁడు జాడలమీద నుజ్జయినిలో నా గణికల నిరువురం బట్టుకొని యామండన మిమ్మని యడిగితిమి. వారిహార మప్పుడే మమ్మతిమని బొంకిరి. ఆమాటలఁ బాటింపక సంకెలలువైచి యాపంకజముఖుల నిరువురను మనవీటికిఁ దీపికొని వచ్చితిమి. స్వామీ అది యేమి మాయయో తెలియదు. మేమెంత బ్రతిమిలాడినను మందలించినను కొట్టినను యాగుట్టు సెప్పక యెట్లుతెచ్చిరో తెలియదు అమండనము భర్తృదారికకిచ్చి వేసిరి. రాచపట్టి వలన ముట్టినట్లు యుత్తరముఁ దీసికొనివచ్చిరి. ఆమె వారిందండింప వలదనికూడ వ్రాసినదట, ఇదిగో యాపత్రికయనిరేని చేతికిచ్చిరి. దానిం జదువుకొని యాభూభర్త యుబ్బుచు నోహో ! ఆ మహానుభావుండు సెప్పినట్లు జరిగినది. తత్ప్రభావ మంచిత్యముగదా ! ప్రాంతమునకు వచ్చితిమి గావున నాయోగిపుంగవుని గాంచి నమస్కరించి కృతజ్ఞతఁ జూపికొంటయ కర్జము అని నిశ్చయించి వారి