పుట:కాశీమజిలీకథలు-06.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము


కాళిదాసుకథ

విశాల నేత్రములు నాజానుబాహువులు వెడదయురము చక్కని మొగము గలిగి దివ్యతేజస్సంపన్నుఁడైన యా పురుషునింజూచి వారు నీవేమి చదివి కొంటివి ? రాజదర్శనముఁ జేసి యేమి యాచించెదవు? కవిత్వ మేమైనఁ జెప్పఁగలవా ? యని యడిగిన వారి కతం డిట్లనియె. నే నేమియుం జదివికొనలేదు. ఆయనపై శ్లోకము రచించితిని వినుండు.

శ్లో. అస్తివద్బకవచ్చైవ చల్లన ద్వెల్లకుక్కవత్‌
    రాజతే భోజ? తేకీ ర్తిః పునస్సన్యాసి దంతవతి.

ఓ భోజుఁడా ! నీ కీర్తి యెముకలాగున కొంగవలె చల్లరీతివెల్లకుక్క చందమున సన్యాసి దంతములట్లు తెల్లనై ప్రకాశించుచున్నది అని చదివెను.

ఆ శ్లోకమువిని వారు నవ్వుచు బాపురే ! వీనిందప్పక రాజునొద్ధకుఁ దీసికొని పోవుదము. యీ పద్యమునకు రాజు మిగుల సంతసింపఁగలడు. ఇంతకన్న మంచి పండితుఁడు లేడని చెప్పుదమని యాలోచించుకొని నాఁడు వాని రాజసభకుఁ దీసికొనిపోయి దేవా ! ఈతం డాశుకవిత్వమునందు మంచి నేర్చరి. వీని కవితా ధోరణికి ఫణీంద్రుడు జడిసి పాతాళ లోకమున నడిఁగి యుండెను. పెక్కు లేల? వీని మించిన కవి పుడమిలో మరిలేడని పరిహాసముగా వానిం బొగడిరి.

ఆ పొగడ్త రాజు సత్యమే యని నమ్మి యా పురుషునకు దర్శన మిచ్చెను. అప్పుడా కవి యీ క్రింది శ్లోకము పఠించెను.

శ్లో. మహారాజ ! శ్రీమాన్‌ జగతి యశనాతే థవళతే
    వయః పారావారం పరమ పురుషోయం మృగయతే
    కపర్దీ కైలాసం కరివరమభౌమం కులిశభృతి
    కళానాధం రాహుః కమలభవనో హంస మధునా.

ఓ మహారాజా ! నీ కీర్తిచే జగం బంతయుఁ దెల్ల బడనది. కావున సముద్రములు పర్వతములు మృగములు పక్షులులోనగు నవి యన్నియు దెల్లనై పోయినవి, అప్పుడు పాలసముద్ర మేదియో తెలియక విష్ణుండును, వెండికొండ యేదియో తెలియక శివుండును, హంస యేదియో తెలియక బ్రహ్మయుఁ దెల్ల యేనుగు యేదియా తెలియక యింద్రుండును జంద్రుఁ డెవ్వడో తెలియక రాహు