పుట:కాశీమజిలీకథలు-06.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము

మంత్రులకుం చెప్పుచు నా వారకాంతలం బట్టితేర శ్రూరులకు కింకరులఁ బెక్కండ్ర నలుదెసలకుం బంపించెను.

అని యెరింగించువఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుడు తరువాతి కథ యవ్వలి మజలీయం డిట్లని చెప్పఁదొడంగెను.

అరువది యొకటవ మజిలీ

సఖీ ! మిక్కిలి వెలఁగల వస్తువయని యించుకయు నాలోచించితిమికాము. అప్పుడు నాబుద్ధి మొద్దువోయింది. "బుద్ధిఃకర్మానుసారిణి" అను నార్యోక్తి యేల తప్పును. ఈ మణిహారమెవ్వరిచేతఁజిక్కునో వారే యీదేశము బాలింపఁగలరఁట ప్రమాదమైన పనిచేసితిమిగదా? ఈరాజ్యమిఁక నారుమాసములకు భోగముది పాటింపఁ గలదని మనపట్టణమున నెల్లరు నద్భుతముగఁ జెప్పుకొనుచున్నారు. శుద్ధాంతములో నేకాంతముగా ననుకొనినమాట యెట్లు వెల్లడియైనదో తెలియదు. ఈ యుపద్రవమునకు వెఱచుచు మీ తలిదండ్రులు నిద్రాహారములుమాని చింతించుచున్నారు. దీనికి ప్రతిక్రియ యేమియుం దోచుకున్నది. అని విచారించుచు హేమ చెప్పుటయు విని స్వయం ప్రభ యిట్లనియె.

అతివా ! కాలగతి నతిక్రమింప బ్రహ్మాదులకు శక్యమగాదన్న మనబోటుల మాటఁజెప్పనేల? పోవుదాని మనమాపఁగలమా! పోనిమ్ము. భాగ్యహీనులమైతి మేని వైరాగ్యముబలసి తపంబు జేసికొనియెదము గాక నదియు నుపకారమే యని చెప్పుచుండగనే యొకపరిచారికవచ్చి హేమను రాజపత్ని తీసికొనిరమ్మనెనని చెప్పినది. హేమయు లజ్జాశోకసంభ్రమములలో పరిచారికవెంట రాజపత్ని యంతః పురమున కరిగి మరలవచ్చినది. స్వయంప్రభ హేమంజూచి అమ్మ నిన్నేమిటికి రమ్మన్నది. విశేషము లేమని యడిగిన నమ్ముగువకు హేమ యిట్లనియె.

సుందరీ ! నీయందు తలిదండ్రులకుఁ గలప్రీతి నేమనిచెప్పుదును. నీవలన నీ యుపద్రవము కలిగినది కావున నిందులకై నీవెక్కుడుగా నుడుకుచుందువని తలంచి నిన్నో దార్చుటకై నన్ను రప్పించిం. ఆహా ! ఏమి వారియక్కటికము. రాజ్యాంతమైనపనిఁజేసినను నీయందు నించుకయు నలుగరుగ ? మరియు నీపురప్రాంత మందలి రత్నగిరి పాదమున వెలసిన స్వయం ప్రభాదేవి యాలయమున నెవ్వఁతో యోగివచ్చియున్నవాడఁట. అతండు త్రికాలవేదియనియు నత్యద్భుతప్రభావ సంపన్నుడనియు విని నిన్న నయ్యగారు కొలఁదిగ పరిజనులు సేవింప గూఢముగా నప్పర్వతమున కేగి దూతికాముఖంబునఁ దమరాక తెలియఁజేసిరట. ఆయోగిపుంగవుండును దర్శనమీయకయే వచ్చినపనియంతయుఁ బూసగ్రుచ్చినట్లు చెప్పి నీరాజ్యమున కేమియు భంగములేదు. హారమువచ్చి నీకూతురు యం బడఁగలదు. వెరవకుమని యోదార్చెనఁట ఆమాటవిని భూపతి మిగుల సంతసించుచు నింటికి వచ్చియత్తెఱఁగంతయు మీయన్ను కెరింగించెను.