పుట:కాశీమజిలీకథలు-06.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(26)

సుమేధుని కథ

217

చుండ మండల పరిభ్రమణంబున నరికి యొకవేటున మ్రుచ్చునొకనిం గడతేర్చుటయు మిగిలినవారు వెఱచి తలయొక దెసకుం బరిగిడిరి. అనివార్యములైన తదీయ విక్రమ సాహస ధైర్యంబుల గాంచి నక్కాంచనగాత్రి విస్మయహర్ష పులకితగాత్రయై యతని యడుగుదమ్ముల మ్రోలం జాగిలిపడి మహాత్మా ! నీవు బ్రాహ్మణ మాత్రుడవు కావు పరశురామునందువోలె క్షాత్రతేజముకూడ నీయందు బొడగట్టుచున్న యది‌. దైవమాపత్సముద్రమున మునుగుచున్న నాకునిన్ను దెప్పగా జూ పెను. తోబుట్టువుగా దలంచి నన్ను నీవెంట గొనిపొమ్ము. మరల నేనావేశ్య యింటికరుగ వెరచుచున్న దాననని యత్యంత వినయ విశ్వాసములతో బ్రార్దించిన నతండాదరించుచు నిట్ల నియె.

పోలతీ నిన్ను జెలియగా మొదటనే తలంచితిని. నీవు తలకకుము. నిన్ను వెంటబెట్టుకొనిపోయి తగినవానికిచ్చి నీకు వివాహముచేసి విడిచి పెట్టెద. తరువాత నీ పుణ్యమని పలుకుచున్నంతలో నొకదెస నుండి పురరక్షకు లత్యంత వేగమున నరుదెంచి యందున్న చౌర్యవస్తువులంగాంచి యహంకరించుచు నతనే సత్కరుండని నిశ్చయించి పట్టుకొనుటకు బ్రయత్నించిరి. కాని యతండు కృపాణ పాణియై వారినెల్ల బలాయితులం గావించెను.

అప్పటికి నీభోకిరణంబులు కొన్ని యాకసంబున బ్రాకినవి. ఇక నందుండ రాదని నిశ్చయించి యతం డమ్మించుబోణితోఁడ రా నటఁగదలి యొక మార్గంబునబడి యెందేనిం బోయెను.

అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు తరువాత యవసధంబున నయ్యతిపతి యవ్వలి కథ యిట్లని చెప్పదొడంగెను.

ఎనుబది యాఱవ మజిలీ

సుమేధుని కథ

చెల్లీ సరోజినీ! మనకిపుడు గమ్యస్థాన మేదియు గనంబడకున్నది. నేను తల్లితండ్రులకైన జెప్పక పారిపోయి వచ్చితిని. నా నిమిత్తము వారు మిక్కిలి పరితపించుచుందురు. నాపై నతం డలిగిన కారణమేమియో తెలియకున్నది. ఇప్పుడా కుముద్వతినగరంబున కఱుగుట యుచితమేమో యాలోచింపుము. నీకును వివాహముఁ జేయవలసి యున్నది నాకు మరల రాజావలంబనముఁ గలిగెనేని నీ పెండ్లి సీతాకళ్యాణమువలెఁ జేయుదునుగదా? అని నుడువుటయు ఘటదత్తునికి సరోజిని యిట్లనియె.

అన్నా ! స్త్రీమూలముననే నీపై అతండలిగియుండును. నీ వెన్నఁడేని వానియింటి కరిగితివా ? వారి తరుణులతో సంభాషించితివా ? యని యడుగుటయు