పుట:కాశీమజిలీకథలు-05.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

95

మరియుఁ బరమజ్ఞానసంపన్నుండగు జనకుం డసంఖ్యాకదక్షిణలతోఁ బెక్కులు జన్నములు సేసి దేవతలఁ దృప్తిపరచియు నంతంబున సర్వభయశూన్యంబునుఁ బరమానందస్వరూపమగు మోక్షముఁ జెందెను కాని తత్ఫల మనుభవించుకొఱకుఁ దిరుగ దేహము నొందలేదని కాణ్వులు చెప్పుచున్నారు. కావున సనందనా! పురందరునిచందంబునఁ దత్త్వవేత్త పాపముల నంటడు. జనకునిపగిది సుకృతఫల మనుభవింపడు. నే నీదురిత మేమిటికిఁ జేసితిని సుకృత మేమిటికిఁ జేయలేదను పరితాపమును బొందువాఁడను కాను. సౌమ్యా! యా శరీరముచేత ననంగశాస్త్రపరిశీలనఁ జేయుట దోషముగాదు. కాని విశిష్టమార్గపరిపాలనముకొరకు కన్యశరీరము నాశ్రయించుచున్నాఁడ. అని యిట్లు భవభయహరణంబులగు సత్కథలం జెప్పుట శంకరయతి శిష్యులతోఁగూడ నరిగి యరిగి యందొకచోఁ బాదచారుల కధిరోహింప శక్యముగాని సముత్తుంగశైలశృంగం బొకండు గనంబడుటయు నశిష్యముగా నక్కూటతటంబున దిగి వెండియు శంకరుం డిట్లనియె.

శా. అంతేవాసివతంసులార! కనుఁడీ! హద్మ్యాంతరమ్మట్టు ల
    త్యంతామోదము గూర్చు నీగుహ విశాలాగ్రస్థలోపేతమై
    ప్రాంతోద్యత్పలభారనమ్రతరుదీప్యత్కూలకాసారతో
    యాంతఃపంకజగంధచోరకసమీరాహ్లాదితాదిత్యమై.

వ. ఇక్కందరాంతరంబున మదీయకళేబరం బునిచి యమరకశరీరంబుఁ బ్రవేశించి పంచశరకళాపాండిత్యంబు సంపాదించుకొని వచ్చెద నంతదనుక మీ రిగ్గుహాంతరంబున మత్కాయం బపాయంబు నొందకుండఁ గాపాడుచుండవలయుంజుఁడీ యని వారికిఁ జెప్పవలసిన మాటలన్నియుంజెప్పి యప్పు డప్పరమహంసము గుహాబిలంబునఁ దన శరీరము విడిచి యోగబలంబున లింగశరీరముతోఁ కూడికొని చని యల్లన నమరకశరీరంబుఁ బ్రవేశించెను.

శా. పాదాంగుష్టకమాదిగాఁగ దశమద్వారంబు పర్యంతమున్
    బ్రోదిం బ్రాణసమీరణంబుల నొగిం బొందింపుచున్ నేర్పుమై!
    మీఁద న్మస్తకరంధ్రమార్గమున నెమ్మిందోయి పైకమ్మహీ
    నాథాంగమ్ముఁగ రంధ్రమార్గమున నిండన్ జొచ్చె నాద్యంతమున్.

అట్లా యోగీంద్రుం డన్నరేంద్రుని మేను జొరబడినతోడనే హృదయంబు గదలఁజొచ్చినది. పిమ్మటఁ గందోయి రవికిరణప్రసారంబున వికసించు నరవిందముకుళంబునఁ దెరవపడినది. మరికొంత సేపున కద్ధరాకాంతుండు నిద్రితుండువోలె లేచి కూర్చుండెను.

అట్లు సంప్రాప్తజీవుండగు జీవితవల్లభుం జూచి యప్పల్లవపాణులు పెల్లుగ