పుట:కాశీమజిలీకథలు-05.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అని యి ట్లొండొరులు శపథములు చేసికొని యయ్యుభయభారతిని సాక్ష్యాధికారమున కభిషిక్తఁ జేసి శుభముహూర్తమునఁ బ్రసంగమునకుఁ బూనుకొనుటయు నద్దేవి వారిరువురకంఠంబులను బుష్పమాలికలు వైచి యోడినవారి మెడనున్న దండ వాడఁగల దిదియే నిదర్శనమని యెరింగించి యయ్యించుబోణి గృహకార్యములం జక్కఁబెట్ట నరిగినది.

తత్ప్రసంగ మాలకించు తలంపుతో వచ్చిన బ్రహ్మాదిదేవతలు తద్గృహప్రాంతాంతరిక్షంబున విమానములపై వసియించి వినుచుండిరి.

అప్పడంతపుంగవు లిరువురు నభిముఖముగా బద్ధాసనులై కూర్చుండి మందహాసశోభితవదనారవిందులై తొందర యేమియుం బూనక స్వాదుప ప్రయోగములచే హృద్గరాభిప్రాయంబుల వెల్లడిఁ జేయుచు నిరువురును వేదమే ప్రమాణముగాఁ దీసికొని యిట్లు వాదించిరి.

మండనుఁడు — ఓ యతిసార్వభౌమా? మీచే జీవేశ్వరుల కేకరూప మంగీకరింపబఁడుచున్నది. అందులకుఁ బ్రమాణమేమి? హేయోపాదేయరహితమగు దానికిఁ బురుషార్ధములేమిం జేసి వేదాంతవాక్యములు మేము ప్రమాణములుగా స్వీకరింపము.

శంకరుండు — మహాత్ములైన యుద్దాలక జనక యాజ్ఞవల్క్య ప్రభృతులైన గురువులు శ్వేతకేతుఁడు లోనగు శిష్యులకు తత్త్వమస్యాది వాక్యములచేఁ బరమాత్మ నాత్మతత్త్వముగా బోధించిరి. ఇదియే ప్రమాణము. అయ్యర్థంబులు శ్రు॥ తత్త్వమసి శ్వేతకెతో శ్రు॥ అభయంవైజనక ప్రాప్తోసితదాత్మానమేనవేదాహం బ్రహ్మస్మీలితస్మాతత్సర్వ మభవత్తత్రకోమోహః కశ్శోకఏకత్వమనుపస్యత॥ ఇత్యాది శ్రుతుల వలన స్పష్ట మగుచున్నది.

మండను — హుం ఫట్ ఇత్యాది శబ్దములవలెనే వేదాంతముల యందలి తత్త్వమస్యాది వాక్యములు పాపములు పోవు నిమిత్తము జపింపఁబడుచున్నవి. కాని వానికి నొకానొక యర్థమందు వివక్షతలేదు.

శంకరు — ప్రాజ్ఞులు హుంఫడాది శబ్దములయం దర్ధ మేమియుఁ దోచకపోవుటచేత జపోపయుక్తములని బలికిరి. విద్వాంసుఁడా! తత్త్వమస్యాది వాక్యముల యందు స్పష్టముగా నర్ధము కనంబడుచుండఁగా జపార్ధత వీనియం దెట్లుగాఁ ప్రాప్తించెడిని.

మండ — యతీంద్రా! జీవేశ్వరులకుఁ దత్త్వమస్యాది వాక్యములచే నభేదము దోచఁబడుగాక యదియెట్టి దంటేని యజ్ఞాదులం గావించు కర్తలను స్తుతిఁజేయునప్పుడు ఈమఖకర్త యీశాభిన్నుఁడని స్తావకముగాఁ జెప్పిన మాట గాని మరియొకటి గాదు. విధియొక్క స్తావకము విధివిశేష మనంబడును.

శంక — క్రతుయూపాదికముల దేవతాస్వరూపములుగా వర్ణించెడు వేద