పుట:కాశీమజిలీకథలు-05.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

81

అమ్మఱునాఁ డహిమకరుం డుదయగిరిశిఖరం బధిరోహింప రేవానదిం గాల్యకరణీయంబులం దీర్చుకొని శంకరయతి పద్మపాదాదిశిష్యులతోఁగూడ మండనపండితుని సభాభవన మలంకరించుటయు వారింజూచి మండనుండు సంతసించుచు యథావిధి నర్చించి యుపవిష్టులం గావించి సమస్తవిద్యావిశారదయగు శారదను స్వదార నాదరంబున మధ్యవర్తినిగానుండ నియమించెను. పతివ్రతాశిరోమణి యగు నయ్యుభయభారతియును, భయభారతీతారతమ్యంబు నిరూపింప నరుదెంచిన భారతియుం బోలె నాసభాభవనంబున మిక్కిలి బ్రకాశించెను. అప్పుడు పరాపరజ్ఞుండైన శంకరయతీంద్రుఁడు వృద్ధినొందుచున్న తదీయవాదోత్సుకత నాలోచించి ముందుగాఁ దాను బరాపరైక్యపరమగు ప్రతిజ్ఞ నిట్లు గావించెను.

మ. పరమానందము నిత్యబుద్ధము పరబ్రహ్మంబు దోచున్నహా
     విరళాజ్ఞానసమామృతం బగుచు నీ విశ్వప్రపంచంబుగా
     నరయన్ జ్ఞానము చేతనంతయు లయం బౌనట్లు వాక్రుచ్చ వి
     స్ఫురదామ్నాయశిరోమణు ల్వెలయు మత్ప్రోక్తప్రమాణంబులై.

చ. ఉరుగతి నేను వాదమున నోడితినేనిఁ గషాయదండస
    త్కరకములం ద్యజించి యతిధౌతపటంబు ధరించి గేస్తునై
    వరఁగెద సాధ్వి యీయుభయభారతియే వివరించుఁగాత బ
    క్షరహితబుద్ధియై మనప్రసంగజయాపజయంబు లేర్పడన్.

అని యి ట్లుపనిషదర్థంబులు ప్రమాణంబుగాఁ జేసికొని వాదింతుననియు నందుఁ బరాజితుండ నగుదునేని సన్యాసము విడిచి గృహస్థుండ నయ్యెదనని శంకరయతి ప్రతిజ్ఞఁ జేయుటయు సంతసించుచు మండనమిశ్రుండు తన ప్రతిజ్ఞాప్రకారం బిట్లని వక్కాణించెను.

ఉ. వేదశిఖల్ ప్రమాణపదవి న్వహియింపవు చిత్స్వరూపసం
    బోధము సేయ దానఁ బరిపూర్ణత గల్గదు లేదు ముక్తి య
    య్యాదిమకాండమే పరమమై తగి ముక్తి ఘటించునంచు నే
    వాదము సేయుదుం బ్రజలవైఖరి గర్మమహత్త్వ మేర్పడన్.

ఉ. ఓసుయతీశ! వాదమున నోడితినేని శిఖోపవీతము
    ల్దీసి కషాయచేల మవలీల ధరించి జగంబెఱుంగ స
    న్యాసముఁ బూని యేను భవదగ్రవినీతుఁడ నౌదు దీనికి
    న్భాసురగాత్రి యీయుభయభారతి సాక్షిణియై తలిర్పఁగన్.