పుట:కాశీమజిలీకథలు-05.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కాశీమజిలీకథలు - ఐదవభాగము

పేరుతో సకలకళాప్రవీణత బడసి చతురాననాంశవలనం జనించిన మండనమిశ్రునకు భార్యయై శాపానసానసమయ మరయుచున్నది.

తుంబు — ఓహో! ఇదియా కథాసందర్భము! తెలిసినది. తరువాత!

నార — తరువాత నేమియున్నది. ఇప్పుడా శంకరయతీంద్రుడు శిష్యులతో గూడ మండనమిశ్రునియొద్ద కరుగుచున్నవాడు. కావున నా సంవాదము వినవలయునని పోవుచుంటి నిక నిలువరాదు. మంచి సమయము మిగిలిపోవును. పోయి వచ్చెద నీరహస్య మెచ్చటను జెప్పకుమీ యని పలుకుచు నారదండు నిష్క్రమించెను.

గీ. ఛాత్రసంయుక్తుఁ డైయట్లు శంకరుండు
    అలప్రయాసము వెడలి యోగానుగతిని
    మింటితెరవున మండనమిశ్రపాలి
    తంబు మహిష్మతీనగరంబుఁ జేరె.

మ. కనియెం దన్నికటంబునం దతిచలత్కల్లోలరంగప్రవ
     ర్తనకృత్కోకముఖాంబునీడజము పద్మవ్యాప్తరోలంబని
     స్వనసంగీతమనోజ్ఞమంచితనభ సబ్బోరితాంతఃకన
     ద్వనజామోదసుతోషితాధ్వగము రేవావాహినీరత్నమున్.

కని తదీయశీకరనికరచోరకములగు కిశోరసమీరములు మార్గాయాసం బపనయింప గొంతసేపు తదంతికభూమి విశ్రమించి యందు మధ్యాహ్నికకృత్యంబులు నిర్వర్తించుకొని శిష్యసహితముగా నరుగుచు దారిలో తారసిల్లిన మండనపండితుని దాదుల మువ్వుర జలంబులం దేర నరుగుచున్నవారిం గాంచి మండనమిశ్రుని గృహం బెందున్నదని యడిగిన విని యప్పరిచారికలును దదీయరూపవిశేషమున కచ్చెరువందును ముందు నందొకమందయాన యిట్లనియె.

గీ. నిగమము స్వతః ప్రమాణమో నిర్ణయించి
   యరయఁ బరతః ప్రమాణమో యనుచు నెచట
   ద్వారనీడాంతరస్థిత కీరచయము
   పలుకు నది సూవె మండనేశ్వరుని గృహము.

మరియొకతె.

గీ. ఇలను సుఖదుఃఖరూప ఫలమొసంగ
   గర్త పరమాత్మయో లేక కర్మొ యనుసు
   ద్వారనీడాంతరస్థితకీరచయము
   పలుకు నది సూవె మండనేశ్వరుని గృహము.