పుట:కాశీమజిలీకథలు-05.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

75

నార - సురగరుడోరగగంధర్వాది దివిజగణంబులు దిక్పాలురు మహర్షులు పెక్కండ్రు తత్సభాంగణము నిండించి తమ తమ విద్యాపాటవము లా చతురాననునకుఁ జూపుచుండిరి.

తుం — మునీంద్రా! భవదీయ వీణాగానమాధుర్యమున సామాజికులకానందముఁ గలుగఁ జేసితివా?

నార - అంతవరకును నవకాశమేదీ? వినుము. అతికోపశుండైన దుర్వాసుండు తనకు సామగానము మిగులబ్రౌఢిమ గలదని పలికి యుచ్ఛస్వరంబున నవ్వేదంబు పఠింపుచు నొక్కచో స్వరంబు దప్పుటయుఁ దెప్పున నప్పరమేష్ఠి మ్రోలనున్న సరస్వతి ఫక్కున నవ్వినది.

తుం - వర్ణంబులంబట్టిన శబ్దసంగతి తదవయవమగుటచే నామె నవ్వుటయు సంతోషముగాదని తెలంచెదను.

నారద - అప్పుడు తత్పరిహాసకృతావమానము సహింపక దుర్వాసుండు క్రోధానలజ్వాలామాలికలలో యనఁ గ్రాలు జటాజాలంబులు విరజిమ్ముచు హుమ్మని కటమ్ము లదరఁ బరమేష్టిపత్ని ననుగరువముతోఁ భిన్న పెద్ద తారతమ్యంబు లరయక మాబోటి తపోధనులను సైతము పరిహసింపుచుంటివా కానిమ్ము. పుడమి మనుష్యజాతిం బుట్టిన నిట్లెన్నఁడును బెద్దల బరిహసింపవుగాయని శపించెను.

తుంబు - శివశివ. ఇంత మాత్రమునకే యమ్మహాదేవిని శపించుట. అయ్యయ్యో దుర్వాసుఁ డెంత కఠినచిత్తుఁడోకదా? తరువాత.

నారద — అతని యలుకంజూచి యందున్న మునితిలకులుగాని దివిజులు గాని యేమియుం బలుకనేరక వెఱపుతో మెల్లమెల్లగా నవ్వలికిం జారఁదొడంగిరి.

తుంబు - పరమేష్టియు నూరకుండెనా ?

నార — లేదు తరువాత నాధాత విషాదమేదురహృదయమైయున్న భాషాదేవిం జూచి పరితపించుచు నమ్మునిసత్తముని శాపనివృత్తికై బ్రతిమాలుకొనియెను.

తుంబు — ఆ కఠినహృదయుని హృదయమేమైనం గరఁగినదా ?

నార — ఎట్టకేఁ గోపము విడిచి శాపము త్రిప్పనోపనని పలుకుచు మనుష్యశంకరుం జూచి ప్రసంగించినప్పుడు శాపవిమోచన మగునని యనుగ్రహించెను.

తుంబు - అదియు నతనియందు గణమేయని తలంచెదను. తరువాత తరువాత!

నార — అప్పుడా వాగ్దేవి భూతలంబున శోణానదీతీరంబున విష్ణుమిత్రుఁ డను శ్రోత్రియబ్రాహ్మణునకు బుత్త్రియై యుదయించి యుభయభారతియను