పుట:కాశీమజిలీకథలు-05.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నార - అతిదయాళుండగు భూతపతి వారిమొఱ నాలించి యభయం బొసంగుచు మానుషశరీరము వహించి శంకరనామమున మీ మనోరథమును దీర్తునని యానతిచ్చెను.

తుం — భక్తజనపరిపాలన మా విభునకు సహజమై యున్నది కావున నట్లనుట యుచితమే. తరువాత.

నార — పిమ్మటఁ గుమారస్వామిం జూచి భట్టపాదుండను పేరుతో బౌద్ధమతంబు ఖండింపుచు ముందు నిగమంబుల కర్మకాండంబు నుద్ధరింపుమని యానతిచ్చెను.

తుం - తరువాత.

నార - తదాజ్ఞానుసారముగా షణ్ముఖుండు పుడమి భట్టపాదుండై యవతరించి యింద్రాంశ వలన జనించిన సుధన్యు నాశ్రయించి బౌద్దులనెల్ల దండింపఁజేసి కర్మమార్గమును ధరణి నిష్కంటకముగ వెలయంజేసెను.

తుం - పితృవాక్యపరిపాలనశీలుర కదియే కదా ధర్మము తరువాత.

నార - తరువాతఁ బరమేశ్వరుండు దక్షిణదేశంబున శివగురుండను బ్రాహ్మణోత్తమునకుఁ బుత్రుండై యుదయించి బాల్యంబుననే సకలవిద్యాపారంగతుండై బ్రహ్మచర్యము నుండియే సన్యసించి గోవిందయతి యనుమతిని వ్యాససూత్రములకు నద్వైతభాష్యము రచించి దేవతాంబల వలనం జనియించిన శిష్యబృందముఁ గూడికొని భట్టపాదుని ముక్తినొందించి తచ్చిష్యుండును బ్రహ్మాంశసంభూతుండును బ్రవృత్తిశాస్త్రనిరంతుండునగు మండనమిశ్రపండితప్రవరుని జయింప నరుగుచున్నాఁడు.

దూర్వాసశాపంబునం జేసి సరస్వతి యుభయభారతియను పేరుతో నవ్విద్వాంసునకు భార్యయై యుదయించినది. ఇప్పుడు కాఁబోవు నప్పండితుల ప్రసంగసంగరంబున మదీయాంతరంగమునకు వేడుక గలుగఁజేసికొను తలంపుతో నరుగు చున్నవాఁడ. అయ్యుభయ భారతియే వారికి మధ్యవర్తిగా నుండునని కైలాసంబున నొకసిద్ధుం డీశ్వరుని కెఱింగింపుచుండ వింటిని.

తుం - ఆర్యా! నీకు మంచిభోజనమే దొరికినది. కాని దూర్వాసయతి సకలలోకపూజ్యురాలగు సరస్వతిని సైతము శపించెనా? ఆహా కోపశీలురకు యుక్తాయుక్తవివేక ముండదుగదా! అమ్మహాదేవి యేమిటికిఁ తత్కోపపాత్రురాలయ్యెను.

నార - అదియుం జెప్పవలయునా! సమయము మిగులునేమో కదా, కానిమ్ము మహాత్ముల చరిత్రలు స్మరించుకొనినను కృతము గలుగజేయునని చెప్పుదురు. వినుము వెనుక సత్యలోకములో జరిగిన మహాసభకు నీవు వచ్చితివా?

తుం — రాలేదు. జరిగినదని మాత్రము వినియుంటిని.