పుట:కాశీమజిలీకథలు-05.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు - శుభమస్తు

శ్రీ శంకరాచార్యచరిత్రము

ప్రధమోల్లాసము

కథా ప్రారంభము

శ్రీరమణీయమై విబుధ సేవితమై ఫలపుష్ప న మధా
త్రీరుహకల్పితోపవన దీపితమై సుమనోజ్ఞ గేహశృం
గారతరాంతరంబగుచుఁ గాలటినాజను నగ్రహారమ
క్కేరళదేశమందమరుఁ గేవలమయ్యమరాలయంబనన్.

సీ. కలనైననరయ శక్యముగాదువిద్యా ప్ర
         సక్తిగాననియథా జాతునచట
    ఘనమతి వెదుకంగఁ గానరాఁడటనాహి
        తాగ్నిగానట్టి గృహాధికారి
    మందునకైన లేడందుసాంగాగమా
        ధ్యయనంబు సేయని యజ్ఞుఁడొకఁడు
    పన్నిదంబునకైనఁ బడయఁజాలముశాస్త్ర
       ధీయుక్తి లేనివైధేయునొకని

గీ. నందరును భూరితత్త్వవిద్యామహత్త్వ
   ఖనులు నవతోషితామరుల్ వినుతయశులు
   వేదశాస్త్రాదివిద్యాప్రవీణబుద్ధు
   లవనిసురులుందు రయ్యగ్రహారమందు.

అయ్యగ్రహారంబు పరిసరంబునం బవిత్రోదకంబై పూర్ణయను మహానది ప్రవహింపుచుండు. దానినంటియే వృషాచలంబు విఖ్యాతంబై విరాజిల్లు నప్పుణ్యగిరి కూటంబున మహేశ్వరుండు జ్యోతిర్లింగ స్వరూపంబున నావిర్భవించి తద్దేశాధిపతి యైన రాజశేఖరుండను నృపాలుని స్వప్నంబునఁ బొడసూపి యాలయ ప్రాకారమంటపాదులఁ గట్టింపుమని నియమించిన మించినసంతసముతో నానరపతి యట్ల కావించి కృతార్ధుండయ్యె. నాటఁగోలె నయ్యగ్రహారంబు పుణ్యక్షేత్రంబై వృషాచలేశ్వరుని మహిమాతిశయంబునం జేసి యీతిబాధాశూన్యంబై యొప్పుచుండు. మఱియునందు—