పుట:కాశీమజిలీకథలు-05.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

కాశీమజిలీకథలు - ఐదవభాగము

లగు యుక్త్యనీకములచే నద్వైద విద్యాపరిపంథులగు భేదవాదుల నభేదబుద్ధులం గావింపుము. అని పలుకుటయుం గులుకుచు నయ్యతితిలకుం డిట్లనియె.

స్వామీ! పరసవేది సంపర్కంబున లోహంబు బంగారమైన తీరున భవదీయ సూత్రసంబంధ వశంబునం జేసినా భాష్యంబువన్నెకెక్కి ధరణిఁజిరప్రచారంబు వహించుచున్నయది. నాపుణ్యమేమని చెప్పఁదగినది. దేవర యాజ్ఞమెట్లోయట్లుకావించి కృతార్థుండయ్యెదనని పలికి యతని పాదంబులకు నమస్కరించెను. అమ్మునిచంద్రుం డతని దీవించుచు నట్టివరంబులిచ్చి యంతర్ధానము నొందెను. తద్వియోగచింతా సంతాపంబు కొంతసేపు స్వాంతంబున వేధింప శంకర హరికాంగ పారాశర్యుని శాసనంబునంజేసి దిగ్విజయంబు సేయ నిశ్చయించి శిష్యసహితముగా శుభముహూర్తంబున గాశీపురంబు బయలువెడలి కతిపయ ప్రయాణంబుల దొలుత బ్రయాగకరిగి తన్మహత్త్వం బంతఃకరణగోచరము జేసికొని పద్మపాదునితో నిట్లనియె.

వత్సా! పద్మపాద? యిమ్మహాక్షేత్రం బొకదినంబున వసించిన వారికి యాగంబులకన్న బ్రకర్షఫలం బిచ్చునది కావున బ్రయాగ యని యన్వర్ధనామంబు వహించుచున్నది. మునింగినవారి దేహంబుల సితాసితంబుల జేయు తలంపుతో నిందు మందాకిని కాళిందీనదితో గలసికొనుచున్నది చూచితివా? యిందు మునింగిన మనుజులు దివ్య శరీరముల దాల్చి యాధివ్యాధుల నెరుంగక పరమసౌఖ్యంబుల జెందుదురని వేదములో జెప్పబడియున్నది సుమీ! మాఘమాసంబున మకరంబున హిమికరుం డున్నతరి నేతక్షేత్ర ప్రభావం బింతయని వక్కాణింపదరంబుగాదు. ఇమ్మహానది పురవిరోధి జటోపరోధంబునం గోపించి తజ్జటావరోధంబు తనకు గలుగునని యెరుంగక యట్టి వాండ్రం బెక్కండ్రను సృష్టింపుచున్నది కంటివే? జడప్రకృతులు రాబోవునది యెరుంగరుగదా? ఈసురాపగ, సన్మార్గవర్తన ప్రసక్తిగలది యైనను నిత్యము నపవిత్రములగు నస్థుల నేమిటికి స్వీకరింపుచున్నదో తెలిసికొంటివా? ఇందుమునుంగు సజ్జనుల దేహము లలంకరించు తలంపుతో సుమీ! అని యనేక ప్రకారంబుల దన్మహత్త్వ మగ్గించి శిష్యుల కెరిగించుచు నయ్యతిసత్తముండు త్రివేణికరిగి శాటీపటంబు కటిం బిగియించి వేణుదండంబు పైకెత్తియఘమర్షణ స్నానము లాచరింపుచు దన్నుగన్న తల్లిని స్మరించుకొనుచు ననుష్టానంబు దీర్చికొనిన పిమ్మట గల్హారశీతంబులగు వాత పోతంబుల మేనికి హాయిసేయ శిష్యులతో వినోద కథాకాలక్షేపము సేయుచు గొంత సేపు తత్తీరసైకతతలంబున విశ్రమించెను.