పుట:కాశీమజిలీకథలు-05.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మగు బ్రహ్మమనుక్షీరము దుఃఖాత్మకమగు జగత్తును నీరముతో దాదాత్మ్యముఁ జెంది యుండ విడఁదీసి స్పష్టపరుచుటచేఁ బరమహంసమని నిస్సంశయముగా వర్ణింప వచ్చును.

వర - తమంబున మందీకృతంబగు దృష్టిని ప్రకర్షగుణయుక్తముగాఁ జేయుచు లోకబాంధవుండన నెసంగి సుహృచ్చక్రముల యార్తి హరింపుచు జిజ్ఞానార్ధములఁ బ్రకటనఁ జేయు నీయతికి యంసాభిఖ్య వేఱొకరీతిం గూడ నన్వర్ధమగుచున్నది సుమీ.

మతం — ఓహో. సూర్యునితోఁ బోల్చితివా? చక్కగా నున్నదిగదా. ఈ మహానుభావుండు పరమహంసయై సంస్కృతి ముక్తి కొఱకు గోవిందయతిచంద్రుని కతంబునఁ బరమాత్ముని ధ్యానించుచుండ నింద్రియతండంబుల నిట్టి చాంచల్యము గలదని చెప్పుచున్నవి వోలె మేఘములు సంచరించుచున్నవి చూడుము.

వరరుచి — వార్షిక దినములలో యతు లాత్మీయస్థానమును విడువకుండుట యాచారము గావున బాలయతియు నీ వర్షాకాల మిచ్చటనే యుండును. నిత్యము నీ మహాత్ముని దర్శనముఁ జేయింపుచున్న యీ ఋతువు మనకు మహోపకారియైనది గదా.

అని చెప్పుకొనుచు వారు నిష్క్రమించిరి - శంకరాచార్యులు గురుశుశ్రూష జనులకవశ్య కర్తవ్యమని తెలుపునట్లనేకాగ్రహారములతో నొప్పుచున్న నర్మదానదీ తీరంబునవసించి యాత్మధ్యానముఁ జేసికొనుచు గోవిందయతి నారాధింపుచు వర్షకాలము గడుపుచుండెను.

ఇట్లుండ నొకసారి భూరిస్తనిత ఘోషములచే భూనభోంతరాళములు పగులఁ జంచలాసంచయంబులు దృష్టిపాతములకు భీతిఁగలుగఁజేయ గల్పాంతమోయని జనులు వెఱచి మొఱలిడ దెసలావరించి వారి వాహతండంబులు వేదండశుండాదండ సదృక్షంబులగువారి ధారలచేఁ బంచరాత్రంబు లేకరీతివర్షించుచు ధారుణితలంబెల్ల ముంచుటయు నప్పుడు గొప్ప చప్పుడుత్పతిల్ల గల్పవారినిధియుంబోలె నుత్తుంగ తరంగంబులతో నర్మదానదిపొంగి తీరములయందలి యగ్రహారముల ముంచినది.

అప్పుడందలి ధరణీబృందారికులు హాహాకార నినాదములతో సస్త్రీ బాల వృద్ధముగా గృహంబులువిడిచి యొండొరులం జీరికొనుచుఁ బ్రాణతుల్యములగు యజ్ఞోపకరముల నరణులఁ బుస్తకముల భారంబున పిల్లలతోఁగూడఁ గక్షస్కంధాది ప్రదేశములంబూని యతికష్టంబున గోవిందయతిచంద్రుని యాశ్రమగిరి శిఖరమెక్కి యొక్కచో స్త్రీ బాలవృద్ధుల నిలిపి గుంపులుగా నరుదెంచి మహానుభావుండైన గోవింద యతీంద్రుఁ డెందున్నవాఁడని యందున్న వారినడిగి యోగసిద్ధులకుఁ గాని ప్రవేశింప శక్యముగాని గుహయందున్న వాఁడని తెలిసికొని యగ్గుహాముఖంబున నిలువంబడి ఫాలభాగంబులఁ గేలుదోయిం గీలింపుచు నేకముఖముగా నిట్లు వేడికొనిరి.