పుట:కాశీమజిలీకథలు-05.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

45

గీ. చెలఁగిలెక్కించు వృషదంశ మెలుకపండ్లు
    కాసరములశ్వములచెంత గతులెరుంగు
    నలరిగోవిందయతిచంద్రు నాశ్రమాంత
    రమున మృగములు జాతి వైరములు మాని.

అందుశంకరుండట్టి విశేషములుచూచి తదీయ మహానుభావతకు నాశ్చర్యము నొందుచు నర్మదానదీశీకరచోకరములగు మలయానిల కిశోరములు మార్గాయాసం బపనయింప నవ్వనములోఁ గొండొకసేపు విశ్రమించి తద్విశేషములరయుచు నలు మూలలుదిరిగి యతఁడొకచో దత్త్వగోష్ఠి విశేషములచేఁ బ్రొద్దులు గడుపుచున్న కొందరఁ దాపసులంగని నమస్కరించి వారి కిట్లనియె.

గీ. భూరిసంసారవహ్ని తప్తుండనగుచు
    ననఘుగోవిందయతిచంద్రు నాశ్రయింప
    నరుగుదెంచితి మునులార? యమ్మహాత్ముఁ
    డెందు వసియించెనో వచియింపుడయ్య.

అనియడిగిన శంకర డింభకుని వచనంబులకు నజ్జడదారులు విస్మయముఁ జెందుచు, అప్పా! నీవిప్పగిది బాల్యంబున విరక్తిజెందుటకు గతంబేమి? నీప్రాయ మల్పమైనను వాక్యంబులు ప్రౌఢములుగా నున్నయవి. నీవెవ్వండవు? మేము చిరకాలము నుండి గోవిందయతీశ్వరుని దర్శింప నిందువేచియున్నారము. అమ్మహానుభావుండు ప్రాదేశమాత్ర వివరముకముగల యిగ్గుహాంతరమున నున్నాఁడని చెప్పుదురు. యోగ శక్తింగాని దీనిఁబ్రవేశింప శక్యముకాదు. మాకట్టి సామర్ధ్యములేదు. ఎప్పటికేని నమ్మహాత్ముండు ప్రసన్నుండు గాకుండునాయని యిందుఁ గాలక్షేపము సేయుచున్నారము.

ఇప్పుడువచ్చి నీవతనిఁజూడ వేడుకపడుచున్నావు. సామాన్యముగా నతనిం గాంచుట శక్యముగాదు. మాతోఁగొంతకాలమిందు వసియింపుము. సద్గోష్ఠినుండమని పలికిన విని శంకరుండు నవ్వుచుఁ దత్సమయోచితముగా వారికిఁ బ్రతివచనములిచ్చి యపుడు వారెల్లనచ్చెరువంది చూచుచుండ దృఢసమాధియోగంబున యోగంబుపట్టి యగ్గుహంబ్రవేశించి యందు సమాధినిశ్చలచిత్తుండైయున్న గోవింద యతీంద్రుం జూచి ముకుళితకర కమలుండై యిట్లు వినుతించెను.

చ. హరునకుఁ బాదభూషయు మురారికిఁ దల్పమునై యెవండు భూ
    ధరధరణీజ సాగర యుతంబుగ ధారుణినుత్తమాంగ మం
    దిరవుగఁదాల్చెనట్టి యురగేంద్రుఁడవీవెకదా మహాత్మా! నీ
    చరణసరోరుహద్వయికి సాగిలిమ్రొక్కెద భక్తి నియ్యెడన్.

గీ. మునుసహస్రముఖంబులఁ దనరునిన్నుఁ
    గాంచిశిష్యులు భయమందఁ గనికరమున