44
కాశీమజిలీకథలు - ఐదవభాగము
గురుతరధ్యానైక నిరతిఁజేసెసమాధి
సంతతియత్యంత సాధువృత్తి
వేదాంతవాక్య సద్విశ్వాసరూపక
శ్రద్ధసుప్రియయయ్యె సంశ్రయింప.
గీ. శంకరునిభూరివైరాగ్య శక్తియట్టి
మహిమగలదియొకొ తలంపఁగ నిన్ని
సద్గుణంబులుగల్పించె సమయమరచి
విరులవాసనలావిర్భవించినట్లు.
శంకరుండు శుభముహూర్తమున బయలువెడలి యుత్తరాభిముఖుండై యరిగి యరిగి.
శా. దారింబోవుచుశంకరుండు ధరణీధ్రహ్రాదినీభూరికాం
తారగ్రామపురీ మనుష్యపశునానాజంతుసంతాన మిం
పారంగాంచుచు నైంద్రజాలికుఁడు మాయాజాలమున్వోలె దు
ర్వారాద్వైతమతిందలంచెను బరబ్రహ్మంబుగానంతయున్.
అట్లు దృశ్యంబంతయు బరమతత్త్వముగా బోధించుచు శంకరుండు కులమతవాదులచే, జెడుమార్గముల నడిపింపబడి బడలియున్న శ్రుతిధేనువు నిష్కంటక మగు నద్వైతమార్గంబున నడించుటకుంబోలె నుత్తమదండంబు ధరించి కాషాయాంబరము కటింగ్రాలు నరుగుచుండెను. అతండు దండధరుండై రక్షకుండు కానిచో మొఱయుచు వేఁటకుక్కలు సారంగబులంబోలె బాషండులు వైదికులం బాఱఁద్రోలకుందురా అద్దేశికపుంగవుం డట్లరిగి యనేకపురనదీపక్కణారణ్యంబుల దాటి యొకనాఁటి సాయంకాలమునకు నర్మదానదీ తీరంబునం బొలుపొందు గోవిందయతి చంద్రుని యాశ్రమాంతరమున కరిగెను.
సీ. మువ్వన్నె మొకము మూపులునాకిపాలిచ్చు
ధేనువత్సముల కెంతేని బ్రీతి
కటితీటవాయ భీకరసింహదంష్ట్రాగ్ర
ములగోకికొను ముదంబునగజంబు
ఫణమల్లవిప్పి తాపము నారసఁ గప్పకు
నిడుపడుగడురక్తి నీడవట్టు
గంతులునేర్పుఁ జక్కఁగమృగాదనకిశో
రములకుఁగలిసి సారంగసమితి.