పుట:కాశీమజిలీకథలు-05.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

330

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మన్నది. అని పలుకుచు శిరీష కుసుమపేశల పక్ష్మమములగు నా గాత్రముల దన మృదుకరతలంబున దువ్వుచు హృదయంబున మిక్కిలి పరితపించెను.

అప్పుడు నేనతనింజూచి వయస్యా! నీవెందులకు విచారించెదవు? మందభాగ్యుండనగు నా మూలమున నీవు తురగమై పుట్టి యనేక కష్టము లనుభవించితివి. అయ్యయ్యో! సోమపానోచితమగు నీ నోటియందు నురగతో గూడిన రక్తము స్రవింపుచుండ దగిలించిన యినుప కళ్లెము యొక్క క్షతము లెట్లుగా సహించితివి?

కిసలయశయనోచితకుసుకుమారగాత్రుండవగు నీవు పడుకొనక సంతతము నిలబడి యెట్లుగానుంటివి? మిక్కిలి కోమలములగు నీ యంగముల గళాఘాతము లెట్లుగా భరించితివి? అక్కటా? బ్రహ్మసూత్రభారమును వహించెడు నీ దేహమున బిడుగుపడినంత బాధగల పీడల నెట్లుగా సహించితివి బాబూ! అని పలుకుచు వానితో బూర్వవృత్తాంతముల ముచ్చటింపుచుండ క్షణకాలము తిర్యగ్జాతి దుఃఖము మరచి యానందించితిని.

అంతలో మధ్యాహ్న సమయమగుటయు హరీతకునితోఁ గూడ గపింజలుడు యథోచితాహారమున నన్ను దృప్తుం గావించి తాను కూడ భుజించి క్షణకాల మూరకొని వెండియు నా కిట్లనియె.

వయస్యా! మీ తండ్రి నీకీ వార్త జెప్పి నన్ను వెంటనే యక్కడికి రమ్మని యాజ్ఞాపించెను. నేనిక బోయి వచ్చెద. నీవు కర్మ పరిసమాప్తి వరకు నీ మహర్షి పాదమూలమును విడువరాదుసుమీ! అని పలికిన విని విషణ్ణవదనుండ నై యిట్లంటి.

కపింజలా! ఇట్టి యవస్థలోనున్న నేను దలిదండ్రుల కేమని సందేశ మంపుదును? అంతయు నీవే యెరుంగుదువు. అనుటయు నతండు నన్నందుండి కదలనీయవలదని హరీతకునకుఁ బలుమారు జెప్పి యప్పగించి నన్ను మరియొకమారు కౌఁగలించుకొని మునికుమారులెల్ల విస్మయముతోఁ జూచుచుండ నంతరిక్షమున కెగిరి యంతర్ధానము నొందెను.

అతండరిగిన వెనుక హరీతకుఁడు నన్నూరడించుచు స్వయముగా నా కాహారాదిక మిడుచు నేకొరతయు రాకుండఁ గాపాడుచుండెను. కొన్ని దినంబులకు నాకు రెక్కలు వచ్చినవి. ఇంచుక యెగురుటకు సామర్ధ్యము కలిగినప్పుడే నాత్మగతంబున నిట్లు విచారించితిని. నా మిత్రుడు చంద్రాపీడుని మహాశ్వేతను జూచుటకు నా మనసుత్సుకము జెందుచున్నది. నేనక్కడికిపోయి వసించెదనని తలంచుచు నొకనాడు ప్రాతఃకాలమున విహారమునకుం బోలె బయలుదేరి యుత్తరదిక్కు ననుసరించి యెగిరి పోయితిని.