పుట:కాశీమజిలీకథలు-05.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

323


కపింజలుని కథ

గంధర్వరాజపుత్రీ! వినుము. నీవట్లు శోకసాగరంబున మునిఁగియుండ గగనవాణి ననుసరించి నే నెగిరితినికదా! అతండు నాకుఁ బ్రత్యుత్తర మియ్యకయే యాకాశమార్గంబునఁ బోయిపోయి క్రమంబునఁ జంద్రలోకమునకరిగి యందు మహోశయంబను పేరుగల సభయం దొప్పుచున్న పర్యంకంబున నా పుండరీక శరీరమును పడవైచి నాకిట్లనియె.

కపింజలా! నన్నుఁ జంద్రునిగాఁ దెలిసికొనుము. నేను జగదుపకారమునకై యుదయించి ప్రకాశింపుచుండ నీ ప్రియమిత్రుఁడు పుండరీకుఁడు కామాపరాధంబున శరీరమును విడుచుచు నన్నుఁ జూచి యిందు హతకా! నీ కతంబున నేను ప్రియాసమాగమసుఖం బనుభవింపకయే ప్రాణముల విడుచుచున్నవాఁడ గావున నీవు సైత మిట్లే కర్మభూమియైన భారతవర్షంబునం జనియించుచు జన్మజన్మకు ననురాగము గలిగి ప్రియాసమాగమసుఖం బనుభవింపక తీవ్రమైన విరహవేదన ననుభవించి మృతినొందఁ గలవని శపించెను.

అప్పుడు నేను అయ్యో! అపరాధమేమియు లేకయే నన్నిట్లు శపించితివేల నని కోపాగ్ని ప్రజ్వరిల్ల నతనిం జూచుచు నాయట్టి కష్టముల నీవుగూడ ననుభవించుమని క్రమ్మర శపించితిని.

అంతలోఁ గోపమడంచుకొని వివేకబుద్ధిచే విమర్శింపుచు మహాశ్వేత మత్కిరణసంజాతమగు నప్సరఃకులంబునఁ బుట్టినఁ గౌరివలన జనియించినది. దానం జేసి నాకాప్తురాలుగదా! అమ్మహాశ్వేతచే వరింపఁబడిన నిమ్మునికుమారుఁడు సైతము బంధువుఁడేయగును. నిష్కారణము శపించితినే కానిమ్ము. జన్మజన్మకు నని పలుకుటచే రెండుజన్మములెత్తినఁజాలు. నాతోఁగూడ నితఁడు మర్త్యలోకంబున రెండుపారులు జనియించునని తలంచుచు శాపదోష మంటక నిట్లనియె.

పూర్వ మతని శరీరము గ్రహించి యశరీరవాణిచే మహాశ్వేత నూరడించుచు నిచ్చటికి వచ్చితిని. ఇది బుండరీకుని శరీరము, శాపాంతమువరకు నిచ్చటనే యుండును. నీవుబోయి యీ వృత్తాంతము శ్వేతకేతున కెరిగింపుము. అమ్మహానుభావుఁ డెద్దియేని ప్రతిక్రియఁ చేయనోపునని పలికి నన్ను విడిచెను.

అప్పుడు నేను మిత్రశోకంబున నంధుండుబోలె గీర్వాణమార్గంబున బరుగిడుచుఁ జూడక యొక వైమానికునిం దాటితిని.

దాన నతండు కోపించి నన్నుఁ జురచురం జూచుచు దురాత్మా! మిథ్యా తపోబల గర్విత! మిక్కిలి విస్త్సీర్ణమగు గగనమార్గంబున గుర్రమువలె నన్ను దాటితివి. నీ కెందును జోటు దొరికినదికాదు కాబోలు. కానిమ్ము. నీకట్లు దాటుట యుత్సాహమని తోచుచున్నది నీవు తురంగమై భూమియందు జనింపుమని శపించెను.