పుట:కాశీమజిలీకథలు-05.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

322

కాశీమజిలీకథలు - ఐదవభాగము

బుల విడుచుదాన నని పలుకుచు నాప్రాంతమందు నిశ్చేష్టితయై పడియున్న మహాశ్వేతను గౌఁగలించుకొని మరియు నిట్లనియె

ప్రియసఖీ! నీవు ప్రియుండు వెండియు వచ్చునని మరణముకన్న నెక్కుడగు నిడుములంబడుచుఁ బ్రాణములఁదాల్చి యాసతో నుంటివి. నాకట్టి యాససైత ముంచుకొన నవసరము లేదుకదా! కావున నాకు మరణమునకు ననుజ్ఞ యిమ్ము. జన్మాంతర మందైన నీ స్నేహము గలుగునట్లు కోరుచున్నదాన నాతప్పుల మన్నింపు మని పలుకుచు లేచి వనకుసుమకిసలయములచే నతనిపాదము లర్పించి హస్తములచే నెత్తి తొడయం దిడుకొని కూర్చుండెను.

అప్పుడు తత్కరసంపర్కంబునంజేసి చంద్రాపీడుని దేహమునుండి యద్భుతతేజం బొండు బయలువెడలి యా ప్రాంతమంతయుఁ దుషారమయము గావింపుచు నంతరిక్షములోఁ గలసి యశరీరముగా నిట్లు పలికినది.

కాదంబరీ! నీవు చింతింపకుము. చంద్రాపీడుఁడు శాపదోషంబునఁ బ్రాణములఁ బాసెను. వీని శరీరమును విడువక నీవు కాపాడుచుండుము. శాపాంతమందుఁ గ్రమ్మర జీవించు నీ శరీరమున కగ్నిసంస్కారము చేయవలదు నీకరసంపర్కంబునఁ దేజంబు దప్పక యట్లే యుండునని పలికిన విని యందరు శిరములెత్తి రెప్పలువాల్పక గగనమును జూడఁదొడంగిరి.

అప్పుడు పత్రలేఖయుఁ దత్తేజస్తుషారశీతలత్వమునం దెప్పిరిల్లి లేచి యావేశించిన దానివలె పరుగిడి యింద్రాయుధము కళ్ళెము పట్టుకొని చంద్రాపీడుఁడు లేక మనమేటికని పలుకుచు నా తురగమును లాగికొని పోవుచు దానితోఁగూడ నచ్ఛోదసరస్సులో దుమికెను.

ఆ వెంటనే యా సరస్సులోనుండి తాపసకుమారుం డొకండు బయలు వెడలి దూరమునుండి చూచుచున్న మహాశ్వేతదాపునకుఁ బోయి శోకగద్గదస్వరముతో గంధర్వరాజపుత్రీ! నన్నెరుంగుదువా? యని యడిగెను.

అప్పు డప్పడతియు శోకానందమధ్యవర్తియై తొందరగా లేచి యతనికి నమస్కరించుచు దేవా! కపింజల! పాపాత్మురాలనగు నే నిట్లు సిగ్గులేక పుండరీకుఁడు స్వర్గగతుఁడైనను జీవించియుంటిని. అతం డెచ్చటికిఁ బోయెను. ఎందుండెను? నీ వెప్పుడైనఁ జూచితివా? యాతని విడిచి నీ వొక్కరుండవు వచ్చితి వేమని యడిగెను.

అప్పుడు చంద్రాపీడుని పరిజన మతనిం జుట్టుకొని వింతగాఁ జూడఁ దొడంగెను. పిమ్మటఁ కపింజలుఁ డామెతో నిట్లనియె.