పుట:కాశీమజిలీకథలు-05.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

319

నని పెద్దయెలుంగున నేడ్చుచుండజూచి మహాశ్వేతయు నతని మొగమునఁ జూట్కి నిలిపి వైవర్ణ్యమును గనిపెట్టి గాఢశోకంబున జేష్టతక్కి పడియుండెను.

అప్పుడతని పరిజన మా వృత్తాంతమెరింగి హాహాకారములతోఁ బెక్కుతెరంగుల నమ్మహాశ్వేతను దూరుచు నుచ్చస్వరంబున హా! రాజకుమార! హా! వైశంపాయన! హా! తారాపీడ! హా! శుకనాస! హా! విలాసవతీ! హా! మనోరమ! మీ కెట్టి యాపద సంప్రాప్తించినది. కటకటా! ప్రజలెంత భాగ్యహీను లయ్యెయ్యో! ధరిత్రి యనాథయయ్యెఁ గదాయని యనేక ప్రకారంబుల విలపింపఁ దొడంగెను.

అతని గుర్రము దైన్యముగా సకిలింపుచు బలుమారతని మోము చూచుచు ఖురపుటాఘాతంబున భూతల రేణువు లెగర విచారంబు సూచింపుచుఁ జిందులు ద్రొక్కఁ దొడంగినది.

అని చెప్పువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుండు పై మజిలీ జేరి తదనంతర వృత్తాంతమిట్లు చెప్పందొడంగెను.


శ్రీరస్తు

కాశీమజిలీకథలు

వత్సా! వినుము. అంత నక్కడఁ కాదంబరియు బత్రలేఖచే చంద్రాపీడాగమనవృత్తాంతము విని చంద్రోదయమున సాగరవేలయుఁబోలె నలరుచుఁ దల్లిదండ్రుల కెద్దియో మిషజెప్పి వెండియు సుందరముగా నలంకరించుకొని పెక్కండ్రు పరిచారికలు సురభిమాల్యానులేపనాద్యుపకరణములు గైకొని తోడరాఁ కేయూరకుడుఁ మార్గము జూపఁ బత్రలేఖకైదండ గొని నడుచుచు మదనలేఖతో బోఁటీ! యీ పత్రలేఖ చెప్పిన మాటలు వింటివా? అతని విషయమై నేను యశ్రద్ధ జేసితినఁట. నా యవస్థయంతయుఁ జూచియు హిమగృహంబున నైపుణ్యముఁగా బలికిన యతని వక్రభాషితములు నీకు జ్ఞాపకములేదా? నీవు సైతమప్పుడు నవ్వుచుఁ జూచి యతని మాటలకుఁ దగినట్లు ప్రత్యుత్తరము జెప్పితివి. అట్టివాఁ డిప్పుడు మాత్రము నన్ను విమర్శించునా?