పుట:కాశీమజిలీకథలు-05.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

37

అట్టి సమయమున శంకరుని తల్లి యుల్లము రంజిల్ల వారి పాదపల్లవములకు నమస్కరింపుచు, మహాత్ములారా! నేడుగా మేము కృతార్థులమైతిమి. ఊరక మీ యట్టి యవభూతలిట్టికాలమున దర్శనమిత్తురా! అయ్యారే! మావంశము కడు చిత్రమైనదని యనేక స్తోత్రములు సేయుచు "అయ్యా! యీ శిశువు చిరుతతనంబుననే సకలశాస్త్ర పారంగతుం డగుటయు నద్భుతకార్యములు గావించుటయుఁజూడ లోకులకు విస్మయము గలుగక మానదుగదా. అదియునుంగాక మీ బోటి మహాత్ములరుదెంచి యీ చిన్న వానితో ముచ్చటించుట యచ్చెరువుగదా? నే నర్హురాలనైతినేని వీని పుణ్యమెట్టిదో వక్కాణింపవేడెద మీరు త్రికాలవేదులగదా" యని సానునయముగా నడిగిన విని యందుఁ గుంభసంభవుండని పేరుపొందిన మహర్షి యల్లన నిట్లనియె.

సాధ్వీ! నీవును వల్లభుండును బుత్త్రార్థులై చంద్రశేఖరు నారాధించితిరి గదా. ఆ కృపాళుండు మీ తపంబునకు మెచ్చి భవదీయ వల్లభుని స్వప్నంబునం బొడ సూపి, దుష్టుండు శతాయు స్సంపన్నుండగు. సర్వోత్కృష్టుండు మితాయుస్సంపన్నుండగు. వీరిలో నీ కెట్టి సుతుండు కావలయునని యడిగిన నావిద్వాంసుం డుత్తమసుతునే కోరికొనియెను. దానంజేసి తదంశంబున మీకీ పట్టి యుదయించెను.

అట్టివాఁడెట్టి వాఁడును గాకుండ నాయని పలికిన విని యులికిపడి యక్కలికి మునితిలకునకు వెండియు నిట్లనియె. మహాత్మా! యేమంటిరి. యామాట నా ప్రాణవల్లభుండు నాకెఱింగింపలేదే మితాయువన నెంతయో తెలియకున్నది. కనికరముతోఁ దత్పరిమాణ మెంతయో వివరింపుఁడు. ఉల్లము తల్లడిల్లుచున్నదని పలికిన విని సత్యమైన నప్రియవాక్యము చెప్పఁగూడదను నిషేధవచనము గలిగియున్నను నేమి కారణముననో యా మహర్షి వీనికి శంకరుఁడు పదియాఱేఁడుల యాయుర్దాయమిచ్చెను. కాని మఱికొన్ని కారణములచే మఱియన్ని యేఁడులు జీవించునని పలుకుచుండఁగనే వలదు వలదుడుగుమని యితర మునులు కనుసన్నలచే వారింపుచు నతనితోఁగూడ శంకరు ననుమతిఁ గైకొని యథాగతముగా నరిగిరి.

శంకరుఁ డల్పాయువని విని తల్లి విలపించుట

పిమ్మటఁ బుత్త్రవత్సలయగు సతీదేవి యమ్మహర్షి మాట వినిన తోడనే యంకుశమునఁ బీడింపఁబడిన కరణి గ్రీష్మంబున నెండిన తరంగిణిపగిది వాయుకంపిత మగు కదళియుంబోలెఁ జలింపుచు నేలంబడి మూర్ఛిల్లి శోకరసావేశంబునఁ బెద్దతడ వొడలెరుంగక యెట్టకేఁల దెప్పిరిల్లి యుల్లము పగుల శంకరునిం గౌఁగిలించుకొని.

సీ. హా! కుమార! సుపుఁత్త్ర హాకులైకఖ్యాత
               సకలకళాపూర్ణ చంద్రవదన