పుట:కాశీమజిలీకథలు-05.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

289

సీ. ఒకసారి యలతమాలిక యంసమునఁ జేతు
          లాని యెుయ్యారము లభినయించు
    నొకతేప మదలేఖ నుపగూహనము సేసి
          కమ్రశృంగారవైఖరుల నెరపు
    నొకపరి యలచిట్టకముల వెలయించి
          ఛత్రదండముల హస్తములనాను
    నొకమారు ద్వారపాలికల వేత్రాగ్రభా
          గములఁ జెక్కుల నాని రమణజూపు.

గీ. గప్పురపువీడె మధరాంతికమునఁ జేర్చు
    నవ్వుతో వానిఁ జూచుచు నానలిననేత్ర
    యతనిచేఁ జూడఁబడుఁ దానట్టులందు
    నెంతసే పాలసించెనో యెఱుఁగదయ్యె ॥

మహాశ్వేత వచ్చినపని ప్రతీహారి చెప్పగా విని యదరుపాటుతో నమ్మేడ దిగి స్నానాదిక్రియలయం దుపేక్ష గలదైనను మహాశ్వేతానురోధంబున దివసవ్యాపారము నిర్వర్తించినది.

చంద్రాపీడుండును పర్వతశిఖరావతరణంబు గావించి యభీష్టదేవతల నారాధింపుచు నమ్మణిమందిరమందే యాహారాదివ్యాపారముల జరిగించెను. భుజించిన తరువాత నతడా క్రీడాశైలము తూరుపు భాగమున లతామంటపము క్రింద సంగీతగృహము ప్రక్కనొప్పుచున్న మరకతశిలాతలంబునం గూర్చుండి తాంబూలము వైచికొనుచు నందలి విశేషంబులం బరికింపుచుండ నమృతరసంబున నాకసంబుఁ బూయబడినట్లు చందనరసవర్షంబున దిగంతములు దడపఁబడినట్లు తెల్లనితేజ మొండతని కన్నులంబడిన వెరగందుచు నిట్లు తలంచెను.

ఆహా! భగవంతుఁడగు శీతభానుం డకాండమున నిందుదయించెను? లేక పాండురజలయంత్రధారలు విడువఁబడినవియా? కాక పవనవిశీర్యమానములగు శీకరములచే భువనమంతయుఁ దెలుపఁజేయుచు నాకాశగంగ భూమికి దిగుచున్నదియా? అని యాలోచించుచు దదాలోకానుసారముగా దృష్టి వ్యాపింపఁజేసెను.

సీ. సురుచిరచ్ఛత్రచామరములఁ బూని గం
         ధర్వకన్యకలు ప్రాంతముల నడువ
    మాలతీవరపుష్పమాలికఁ గేలఁ గై
         కొని తమాలిక పార్శ్వ మనుసరింప