పుట:కాశీమజిలీకథలు-05.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

కాశీమజిలీకథలు - ఐదవభాగము


రాజశేఖరుండను రాజు శంకరు నాశ్రయించుట

అప్పుడు ప్రజలం బాలించు రాజ శేఖరుండను నృపాల శేఖరుండతని విఖ్యాతి విని మిగుల వేడుకపడుచు నొకనాడతనిం దీసికొని రమ్మని తన ప్రధాన మంత్రిని గాలట్యగ్రహారమున కనిపెను. అయ్యమాత్యోత్తముండల్లన శంకరునొద్దకుం జని నమస్కరించి, మహాత్మా! నేను రాజశేఖర నృపాలుని యమాత్యుండ. నా పేరు సుబుద్ధియండ్రు. అమ్మహారాజు భుజబలంబున సకల భూభుజుల జయించి యీదేశంబు నిరర్గళ ప్రతాపంబున బాలింపుచున్నాడు తత్త్వజ్ఞానంబున జనకుని యంతవాడు. దాతృత్వంబునగర్ణాదుల మించినవాడు. తదీయ సభామండలంబున సంతతము పండితపుండరీకులు సరసవాద ప్రసంగంబులు గర్ణసుఖం బొనరింపుచుందురు.

ఆ నృప తిలకుండు పండిత ప్రియుండు. సరసకవితాధురంధరుండు. అవధాన్యుండు భవదీయ దర్శనలాలసుండై నన్ను బుత్తెంచెను. సంసార సాగర నిమగ్నుల నుద్ధరింప గంకణము గట్టికొన్న మీ పాదరేణు నాదరముతో శిరంబున దాల్ప నౌత్సుక్యము జెందుచున్నాడు. ఈ భద్రదంతావళము నెక్కి విచ్చేయుడు. అని యనేక ప్రకారముల బ్రార్ధించిన విని మందహాసము జేయుచు శంకరుండిట్లనియె. సుబుద్ధీ! మీరాజు సద్గుణవిశేషముల కెంతయు సంతసించితిమి మేము బిక్షాన్నము భుజించుచు జన్మమె పరిధానముగా ధరించి త్రికాలనియమములచే కాయమును గ్లేశ పరచుచు వేదాధ్యయనము గావించు బ్రహ్మచారులము. ఇట్టి మేము సహజకర్మల విడచి కుత్సితభోగములగు గజాశ్వాందోళకాదుల నధిష్టించి మీరాజు నొద్దకు వచ్చి మా ప్రజ్ఞాప్రభావముల జూపి ద్రవ్యము సంపాదించి యేమి చేయుదుము. మాకీ తుచ్చ భోగములం దభీప్సితము లేదు. కావున నీవు యథాగతముగా నింటికింజని మా వాక్యముగా మీ రాజును బలుమారు నిట్లు బోధింపుము

రాజు ప్రజలకుఁ దగినవృత్తు లేర్పరచి వర్ణాశ్రమాచార నియమంబులు దప్పకుండ ధర్మనిరంతులం గావించి పాలింపవలయును. ప్రజల సుకృతదుష్కృతములలో నాఱవవంతు నృపాలునిఁ జేరునండ్రు. సక్తవ్యసన విరక్తిబొందిన నరేంద్రుండు పరమ సుఖంబొందు. నిదియె మదీయ హితోపదేశంబని యుపదేశించిన విని యామంత్రి మాఱు మాటపలుకక యతని యనుమతిఁ గైకొని మరల రాజశేఖరునొద్ద కరిగి యతని మాటల తెఱంగెఱింగించి మఱియు.

చ. అఱువదినాల్గువిద్యల రహస్యములం గ్రహించి యేడు వ
    త్సరముల ప్రాయమంద నియతవ్రతుఁడై యొక విప్రకాంత పే
    దరికమువాపి యేటినిలు దాపునఁబెట్టిన దిట్ట తుచ్ఛపున్
    సిరులకు నాసఁజెంది మన చెంతకు వచ్చునె పిల్చినంతటన్.