పుట:కాశీమజిలీకథలు-05.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

33

శంకరుడు తత్సమయోచితములగు మాటలచే దల్లికి సంతోషము కలుగ జేసి మాతృసేవ జనుల కవశ్యకర్తవ్యమను విషయము బోధించుకొరకు గొన్ని దినములు దల్లిని సేవింపుచు సూర్యాగ్నుల నారాధింపుచు నింటవసించెను. ప్రాయముచే నల్పుండైనను విద్యామహిమలచే నధికుండయిన శంకరుం జూచినతోడనే యందలి జనులాబాల వృద్ధముగా మిక్కిలి గౌరవము చేయుచుందురు. మరియొకనాడు సతీదేవి మండు వేసవిని మిట్టమధాహ్నంబున బూర్ణానది కరిగి నీరు దెచ్చుచుండ నడుమదారిలో స్వభావ మృదువులగు తత్పదములు సూర్యాతపతప్తమగు నిసుకలో నంటికొనుటయు నడచుటకు దొట్రుపడు చుండెను.

అప్పుడు కొందరు జనులామెంజూచి తొందరపడచు వడివడి శంకరునొద్ద కరిగి, మహాత్మా! సతీదేవి నియమములచే శరీరమును మిక్కిలి కేశపరచియున్నది. దుర్బలశరీరముగల యామె యిప్పుడు మిగుల తపించిన యిసుకలో నడువలేక చిక్కు పడుచున్నది వేగబోయి తీసుకొనిరమ్ము. మేమంటుకొనుటకు వీలులేకపోయినదని పలికిన విని యతండదరిపడి వడివడింజని తామరాకులం దీసికొనివచ్చి, నేలంబరచి వాని మీద నడపించుచు దుర్దును స్యేదజలంబు హరింప దాళ వృంతంబుల వీచుచు నాయాసము వాయజేసి, యింటికిం దీసికొనిపోయి మిక్కిలి పరితపించుచు బెక్కు పచారముల గావించెను.

మరియు నారాత్రి నియమితచిత్తుండై శంకరుండు తత్తటినీ వరంబును గృహనికటంబుగా బ్రవహింపజేయు తలంపుతో మనోహర వృత్తరత్నములచే గంగా స్తవము గావించెను. సత్యవచనుండు శంకరుని భక్తికి మెచ్చి యమ్మహానది మరునా డుదయకాలమునకు దద్గృహముదాపుగా మందవాతానీతములగు జలశీకరములచే లోకుల బవిత్రముజేయుచు బ్రవహింపజొచ్చినది. తత్ప్రాంతమున మాధవుని యాలయమొకటి విరాజిల్లుటంచేసి తదీయపాదంబుల సేవింప నరుదెంచిన మందాకినియో యన నవ్వారి నిధికళత్రం బచ్చటివారి కవ్వారిగ విస్మయ సంతోషములు గలుగజేసినది. దూరముగా నున్న పూర్ణానది యప్పుడగ్రహారము దాపుగా బ్రవహించుచుండుటంజూచి యందలి ప్రజలు తల్లిమూలమున శంకరుడే దానినట్లు కావించెనని యతని మహిమ నద్భుతముగా జెప్పుకొనదొడంగిరి.

అట్లు గోపాలకృష్ణుండువోలె నబ్బాలుండద్భుత విద్యా విశాలుండై యమానుషకార్యంబులం గావింపుచుండ గ్రమంబున దదీయ మహిమాతిశయంబు లాదేశంబంతయు వ్యాపించినవి.