పుట:కాశీమజిలీకథలు-05.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

కాశీమజిలీకథలు - ఐదవభాగము

రామభట్టు — ఈ యలఁతి సిరితోనేమి యతని యనుగ్రహమే కలిగినచో మనకు శాశ్వత సుఖపదమే కలుగునుగాదా.

సుమతి - అవును ఇది మొదలు మనమతని సహాధ్యాయ బుద్ధి విడిచి దైవముగా భావించుదుముగాక.

రామ —— అతం డవతారమూర్తియే కానిచో నేడేండ్ల ప్రాయము గలవాని కీ ప్రజ్ఞ లెట్లు కలుగును.

సుమతి - అతండు కొంతకాల మిందుండునా ?

రామ — ఇక బదిదినములు మాత్రముండి పిమ్మట నింటికిం జనునట. తల్లి యొద్దనుండి రమ్మనుమని వార్తరాగా దిరుగనట్లు ప్రతి వార్త నంపెను.

సుమతి — అట్లైన మనముగూడ నతనితో బోవుదము కృతృత్యుల మగుదుము.

అని యెరింగించి మణిసిద్ధుండప్పటికి కాలాతీతమగుట దదనంతరోదంత మవ్వలి మజిలీయం దిటుల చెప్పదొడంగెను.

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

49 వ మజిలీ

ద్వితీయోల్లాసము

అట్లు శంకరుండ పూర్వ ప్రభావప్రచారములచే నేడవయేడు ముగియు వరకు గురుకుల వాసముజేసి సర్వవిద్యలయందు నసమానపాండిత్యము సంపాదించి సర్వభాషాకవిత్వచాతురీధురీణుండై సరస్వత్యవతారమని యెల్లరు గొనియాడుచుండ నింటికింజని తల్లికి నమస్కరించెను.

శంకరుని మాతృసేవ

సతీదేవియు దదీయాద్భుత విద్యా గ్రహణసామర్థ్యము విని వెరగుపడుచు బుత్త్రుం దీవించి కౌగలించుకొని శిరము మూర్కొని ముద్దాడి తద్దయు గారవించి విద్యాభ్యాస కాలవిశేషము లడిగెను.