పుట:కాశీమజిలీకథలు-05.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

31

సుమతి - లేదు. మదీయ పరాభవదుఃఖముచేత మూఁడు రోజులనుండి నేను బయటకేరాలేదు. ఏదియో చెప్పుము.

రామభట్టు — శంకరుండును సోమవర్మయు నిన్నను మాధుకర భిక్షకై యొక పేద పారునింటికింజని భవతి భిక్షాందేహి యని యడిగిరఁట.

సుమతి - తరువాత.

రామభట్టు - ఆ మాట విని యాయింటి యిల్లాలు వాకిటకివచ్చి వారింజూచి, వత్సలారా ! మీరు వామనమూర్తుల వలె వచ్చి నన్ను భిక్ష నడిగితిరి. నేనేమి చేయుదును. మీయట్టి వారికిఁ బెట్టుకొను భాగ్యము నాకు లభించినదికాదు నేను మహాపాపాత్మురాలను. ఇంట నేమియును లేక మూఁడు దినములనుండి యుపవాసము చేయుచున్నాము. తొలుతనే యీ పాడుకొంప కేమిటికి వచ్చితిరి. మఱియొక చోటనుగూడ లభింపదు. వూరక పోవకుఁడీ యుసిరకకాయమాత్రమున్నది. ఇది గైకొనుఁడని యా ధాత్రీఫలం బిచ్చి యూరక విచారింపఁ దొడంగినది.

సుమతి — అయ్యో! యీ యగ్రహారంబున నంతకటికి దరిద్రులున్నారా? శివశివా యప్పుడప్పుణ్యాత్మురాలి మనస్సెంత తపించినదోకదా. తరువాత.

రామభట్టు - భక్తిపూర్వకముగా నిచ్చిన యా ధాత్రీఫలము గైకొని శంకరుండు తదీయదారిద్ర్యదోషమునకు మిక్కిలి వగచుచు నప్పుడే సద్వృత్తరత్నములచే మహాలక్ష్మిని స్తోత్రముఁజేసి సాక్షాత్కరించిన యమ్మహాదేవిని నప్పాఱెత దారిద్ర్యము వాయఁజేయుమని వేడికొనియెను.

సుమతి - దీన నతండు దీనదయాళుండైనట్లు స్పష్టపడుచున్నది గదా. పిమ్మట.

రామభట్టు — పిమ్మట నయ్యిందిరాదేవి యతని యనుమతి గతి వారి మందిరములోఁ గనకామలవర్షము గురిపించినది.

సుమతి — ఆ యిల్లాలి పూర్వసుకృత పరిపాకంబునంగాక యబ్బాలుండు వారింటికి భిక్ష కరుగునాఁ తరువాత.

రామభట్టు — వానచినుకులనడుమఁ దమవాకిటంబడిన పైఁడి యుసిరిక కాయలం జూచి యా యిల్లాలు సంతోషము పట్టజాలక యబ్బురముఁ జెందుచు నా వృత్తాంత మెల్లరకుం చెప్పినది.

సుమతి - ఆ యుసిరికాయలం నీవు జూచితివా ?

రామభట్టు - సోమవర్మతో నీ కథఁ జెప్పుచు నామె వానికా కాయలం జూపినదఁట. అతండు నాకీ కథ రాత్రిఁ జెప్పెను.

సుమతి - మనముగూడ నతని నాశ్రయించుచుందుము. మహాలక్ష్మి వాని చేతులో నున్నది గదా. యెప్పుడైన దయ రాకపోవునా ఏమి ?