పుట:కాశీమజిలీకథలు-05.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

277

అట్లుకాక క్రియచేతనే కృతజ్ఞతను వెల్లడించెడి నీవును నిట్లు నిందించుకొనియెద వేటికి? అతని నిమిత్తము మహైశ్వర్యసుఖములన్నియుఁ దృణముగానెంచి విడిచితివి! తల్లిదండ్రుల కెడమైతివి. వనితాజనదుష్కరములగు నియమములచే గాయమును గ్లేశపరచుచుంటివి.

ఇదియునుంగాక శోకాభిభూతులచేత నాత్మ యనాయాసముగా వినబడుచున్నది. అతిప్రయత్నమున గాని క్లేశముల యందుంచబడదు. మరణమనునది యపండితులు గావింపుచుందురు. తండ్రిగాని, తల్లిగాని, భర్తగాని, మిత్రుడుగాని మృతి నొందునప్పుడు తానును మృతినొందుట కంటె యవివేకములేదు. దీనివలన వానికేమైన నుపకారము జరుగునా? తిరుగాఁ దీసికొనివచ్చునా? పరలోకసౌఖ్యమిచ్చునా? దర్శనమిచ్చునా? యేమియుం జరుగదు. ఆత్మహత్యాపాతక మొండుమాత్రము వేధించి నిరయము నొందఁజేయును.

బ్రతికియుండి జలాంజలిదానాదివిధులచే నుపకృతి జేయవచ్చును. రతీదేవి వృత్తాంతము స్మరించుకొనుము. ప్రియుండు హరనయనహుతాశనదగ్ధుండైనను దాను మృతినొందక వేరొకరీతి నాతనిపొందు గలిగియున్నది. మరియుం బెక్కండ్రు కాంతలు ప్రియులు లోకాంతరగతులైననుఁ బ్రాణములు విడువక నిలిచియుండి సుఖించుచుండుట వినియుండలేదా? అదియునుంగాక భగవతిచే స్వయముగానే పునస్సమాగమసూచకమగు వచనము వినఁబడినదికాదా? ఆ మాట వితధమెట్లగును? నిస్సంశయముగా నమ్మహానుబావుండు తిరుగా సురలోకమునుండి రాగలఁడు. మహాత్ముల ప్రభావ మచింత్యమైనది. పరలోకమున కేగి మరల వచ్చిన చరిత్రలు పెక్కు మనము పురాణముల వినుచున్నవారము. పుండరీకుండు నట్లు రావచ్చును. రాకున్నను నేమి చేయగలము? ఎవ్వరిని నిందింపము? విధి బలవంతమైనది. దైవహతకుని విలాసము లతిపిశునములు. ఆయతస్వభావములు దుఃఖములు, అనాయతస్వభావభంగురములు సుఖములు. ఒకజన్మమునందు సమాగమము, జన్మాంతరసహస్రములయందు విరహము గలుగుచుండును. ఆత్మను నిందించుకొనరాదు. సంసారమే యతిగహనమైనది. దీని ధీరులుగాని దాటలేరు కదా!

అని యిట్లు మృదువులైన స్వాంత్వనవచనములచే నామె నోదార్చుచుఁ జంద్రాపీడుఁడు వెండియు నిర్ఝరజలంబు దెచ్చి బలాత్కారముగా నశ్రుజలకలుషితమగు నామె మొగమును గడిగించెను.

అంతలో మహాశ్వేత వృత్తాంతమును వినుటచే శోకించువాఁడుంబలె దివసవ్యాపారము విడిచి రవి యధోముఖుం డయ్యెను.

అని యెరింగించి మణిసిద్ధుండు గోపా! యిప్పుడు వేళ యతిక్రమించినది,