పుట:కాశీమజిలీకథలు-05.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

కాశీమజిలీకథలు - ఐదవభాగము

దేవీ! పాపాత్మురాల నా కేమియుం దెలియదు. ఐనను నీ దివ్యపురుషుఁడు నిన్నుఁ దయతోఁ దండ్రియుంబోలె నోదార్చుటఁజూడ మిక్కిలి వింతగానున్నది. ఆలోచింప నసత్యముగా నిట్లు పలుకుట కేమియుఁ గారణము గన్పడదు. కావున నిప్పుడు ప్రాణపరిత్యాగవ్యవసాయమునుండి మరలుటయే యుత్తమము. ఆ పురుషుఁ ననుసరించి కపింజలుఁడుగూడఁ బోయెనుగదా! అతని కట్లు పలుకుట కేమి యవసరమో యించుక యాలోచింపుము. మరణమునకేమి తొందర! పిమ్మట బొందవచ్చును కపింజలుఁడు మరల వచ్చువరకైనఁ బ్రాణములు దాల్చియుండుము, తరువాతఁ జూచుకొనవచ్చునని పలుకుచు నా పాదంబులం బడినది.

జీవితాశ యెల్లరకు దుర్లంఘ్యమయినది. కావుననే నే నట్లు చేయుటయే యుత్తమమని తలంచి జీవితమును విడువఁజాలక కపింజలుని రాక గోరుచు నతిదారుణమైన యారాత్రి తరళికాసహాయినినై సహస్రయుగప్రాయముగా వెళ్ళించితిని.

మరునాఁ డరుణోదయంబున నాసరస్సులో స్నానముచేసి పుండరీకునికి బ్రీతిగాఁ దత్కమండలము తద్వల్కము దజ్జపమాలికను ధరించి సంసార మసార మనియు వ్యసననిపాతము లప్రతీకారసాధ్యము లనియు శోకము దుర్నివారమైన దనియు దైవము నిష్ఠురుఁడనియు సుఖము లనిత్యము లనియు నిశ్చయించి తల్లితండ్రుల లెక్క సేయక పరిజనములతోఁ గూడక సకలబంధుజనులకు మనసుచేత నిరసించి యింద్రియసుఖములయందుఁ జొరకుండ చిత్తమును నియమించి బ్రహ్మచర్యవ్రతమును గైకొని భక్తజనతత్పరుం డగు నీ పురహరు నారాధింపఁ దొడంగితిని.

నావృత్తాంతమును విని సకలబంధుపరివృతుండై నా తండ్రి వచ్చి యింటికి రమ్మని యెంతేని బ్రతిమాలెను కాని నామనము తిరిగినదికాదు. పుత్రికాస్నేహంబున నతండు పెద్దతడవు నాకొరకు నిరీక్షించుకొని చివరకు నిరాశుడై దుఃఖముతో నింటికిఁ బోయెను.

నాటంగోలె నేనిందు నమ్మహాపురుషుని కశ్రుమోక్షణమాత్రంబున కృతజ్ఞత జూపించుకొనుచు జపవ్యాజమునఁ దద్గుణముల లెక్కించుకొనుచు బహువిధములగు నియమములచేత శరీరమును వాఁడజేయుచు నీత్ర్యంబకుని సేవింపుచు నాతరళికతోఁ గూడ నీగుహయందు వసించియుంటిని.

మహాభాగ! ఆ బ్రహ్మహత్యాపాతకురాలను నేనే. ఇదియే నా వృత్తాంతమని పలికి యక్కలికి వల్క లోపాంతభాగంబున మోము దప్పించుకొనుచు దుర్నివారమైన బాష్పవేగము నద్దుకొనుచు నుచ్చస్వరముతో నేడువఁదొడంగినది.

చంద్రాపీడఁడు తదీయవృత్తాంతమంతయు విని యా కృతజ్ఞతావిశేషమున కత్యంత సంతోషింపుచు మెల్లగా నిట్లనియె భగవతీ! క్లేశభీరుఁడు నకృతజ్ఞుడునగు జనుండు స్నేహసదృశమైన కార్యమును జేయలేక నిష్ఫలమైన యశ్రుపాతమాత్రముచేతనే మైత్రిం బ్రకటించుకొనును.