పుట:కాశీమజిలీకథలు-05.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

275

జేయునుగదా. అతిప్రయత్నముతో ధరించిన యీ ప్రాణముల శోకానములకు నింధనములుఁ జేయకుమని పలికిన విని యక్కలికియు నిట్టూర్పు నిగిడింపుచుఁగన్నుల నశ్రువులు గారుచుండ విషాదముగా నిట్లనియె.

రాజపుత్రా! అట్టి దారుణశోకసమయమందే విడువని యీ కృపణప్రాణములు నన్నిప్పుడేల విడుచును? నిక్కము. పాపాత్మురాలనగు నాకంతకుఁడు సైతము దర్శన మీయ వెరచుచున్నాడు. కఠినాత్మురాలనగు నా కిప్పు డీశోక మేమిటికో? ఇది శోకమా? అళీకము, సిగ్గులేనివారలలో నేను మొదటిదానను. వజ్రమయమగు హృదయముతో నట్టిదుఃఖ మనుభవించితిని. కాని యనుభూతమయిన దానించెప్పిన నేమి లెక్క యున్నది? తదనంతర వృత్తాంత మాకర్ణింపుము.

నేనట్లు పెక్కుతెరంగులఁ బలవరింపుచుఁ దరళికం జూసి, బోటీ! ఇఁక నా జీవిత మేమిటికి? జింత యేమిటికి? చితి రచింపుము, అగ్నింబడి ప్రాణేశ్వరుం గలిసికొందునని పలికితిని.

అట్టి సమయమున నంతరిక్షమున జంద్రమండలము నుండి వెల్వడి యమృతడిండీరపాండురమగు నుత్తరీయాంశుకము అంసదేశమున వ్రేల మనోహరాలంకారభూషితుండైఁ మహాపురుషలక్షణోపేతుండై దివ్యాకృతితో నొప్పు నొక్కమహానుభావుఁడు ధవళదేహప్రభావితానములు దిగంతముల వ్యాపింప మెల్లన నచ్చటికి వచ్చి అతిశీతలస్పర్శములుగల నంగుళులతో నొప్పు నైరావతకరపీపరములగు బాహువులచే నందు గతాసుఁడైపడియున్న పుండరీకుని దేహము నెత్తుచు న న్నుద్దేశించి దుందుభినాదగంభీరమగు స్వరముతో, వత్సా! మహాశ్వేత! నీ విప్పుడు ప్రాణములు విడువకుము. నీ కితనితో వెండియు సమాగమము కాగలదు. అని తండ్రివలె న న్నోదార్చి యతండు పుండరీకశరీరముతోఁ గూడ గగనతలమున కెగసి యరుగుచుండెను.

అప్పుడు నేను భయవిస్మయకౌతుకంబులు చిత్తంబుల పెట్టఁ దలపైకెత్తి చూచుచు, ఆర్యా! ఇది యేమి యద్భుతమో చెప్పుమని కంపింజలు నడిగితిని.

అతండు నాకేమియుఁ బ్రత్యుత్తర మియ్యకయే తొందరగాలేచి అంతకా? దురాత్మా! నామిత్రు నెచ్చటికిఁ దీసికొనిపోవుచున్న వాఁడవని యలుకతోఁ బలుకుచు నుత్తరీయవల్కలము నడుమునకు బిగించి యమ్మహాపురుషు ననుగమించి యంతరిక్షమున కెగసెను. మేము చూచుచుండగనే వారు నక్షత్రమండలములలోఁ బ్రవేశించి యంతర్ధానము నొందిరి.

ప్రియతమమరణంబునం బోలెఁ గపింజలుగమనంబున శోకం బిబ్బడింప నా హృదయం బప్పుడు ఖేదిల్లినది. అప్పుడు కింకర్తవ్యతామూఢత్వంబునం దరళికం జూచి, యోసీ! ఇప్పుడు నాకేమియుం దెలియకున్నది, యెరింగితివేని నీవు నాకుఁ దెల్లముగా వక్కాణింపుమని యడిగిన నదియు మదీయమరణమున సహింపక నా కిట్లనియె.