పుట:కాశీమజిలీకథలు-05.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

253


రాజనీతి

తాత! చంద్రాపీడ! సమస్తశాస్త్రములు నభ్యసించి వేదితవ్య మంతయు గురుతెరిఁగిన నీకు మేమేమియు నుపదేశింప నవసరములేదు. స్వభావముచేతనే వ్యాపించిన యౌవనతమము సూర్యప్రభచేతను రత్నకాంతులచేతను, దీపరుచులచేతినుఁ బోవునదికాదు. లక్ష్మీమదము సైతము దారుణమైనదే, యైశ్వర్యతిమిరాంధత్వము అంజనసాధ్యమైనదికాదు దర్పదాహజ్వరము శిశిరోపచారముల నుపశమింపదు. విషయవిషాస్వాదనమోహము మంత్రబలంబున నశించునదికాదు రాగమలావలేపనము స్నానంబునం బోవునదిగాదు. గర్భేశ్వరత్వము, యౌవనత్వము, అనుపమసౌందర్యత్వము, నొక్కొక్కటియె యవినయమునకుఁ దావలమగుచుండ నన్నియు నొక్కచో నుండునప్పు డేమి చెప్పఁదగినది?

యౌవనారంభమందు శాస్త్రజలములచేఁ గడఁగబడినను బుద్ధి కాలుష్యము నొందకమానదు తరచు మౌనులదృష్టి రాగముతోఁ గూడుకొని యుండును. నీవంటివారే యుపదేశమున కర్హులు. స్ఫటికమణి యందుఁ జంద్రకిరణములువలె నిర్మలమగు మనంబున నుపదేశగుణములు ప్రవేశించును. గురువాక్యము నిర్మలమైనను జలమువలె దుర్జనులకు శ్రవణగతమై శూలను గలుగఁజేయును. అనాస్వాదితవిషయసుఖుండవగు నీ కిదియే యుపదేశసమయము కుసుమశరప్రసారజర్ఝరితహృదయులగువారి కుపదేశము జలమువలెనే నిలువక జారిపోవును చందనవృక్షమునఁ బుట్టిన యగ్ని మాత్రము దహింపకుండునా? బడబాగ్ని యుదకముచేత నడంగునా? జనులకు గురూపదేశము ప్రక్షాళకాముల వంటిది విశేషముగా రాజుల కుపదేశించువారులేరు. జనులు ప్రతిధ్వని వలెనే రాజవాక్యముల ననుసరించి పలుకుదురు.

ధనమదులు దర్పవ్రణపూరితములగు చెవులుగలవారై గురూపదేశములను వినరు. వినినను గజములవలె గన్నులు మూయుదు నుపదేష్టలను బాధింపుచుందురు. ధనము అళీకాభిమానములఁ గల్పించును. రాజ్యలక్ష్మి తంద్రీప్రదమైనది. రాజ్యలక్ష్మి సరస్వతీయుతుం డగువాని నసూయంబోలె జూడనీయదు. గుణవంతు నపవిత్రుపగిది ముట్టనీయదు సుజను నున్మత్తునివలెఁ బరిహసించును. వినీతు మహాపాతకుపగిది దాపుఁ జేరనీయదు. అది తృష్ణావిషవల్లులకు సంవర్ధనధార, ఇంద్రియమృగములకు వ్యాధగీతి, మోహదీర్ఘనిద్రకు విభ్రమశయ్య, ధనమదపిశాచములకుఁ దిమిరసంహతి, అవినయమున కుత్పత్తిస్థానము. అన్నన్నా! రాజ్యలక్ష్మిచేత నాలింగితులగు రాజు లొడలెఱుంగుదురా? అభిషేకసమయమందే మంగళకలశజలములచే దాక్షిణ్యము కడగఁబడుచున్నది.

అగ్నికార్యధూమముచేత హృదయము మాలిన్యము బొందుచున్నది. పురోహితుని కుశాగ్రసమార్జనముచేత క్షాంతి పోవుచున్నది. చామరపవనముచేతనే సత్యవాదిత యెగిరిపోవుచున్నది.