పుట:కాశీమజిలీకథలు-05.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

248

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అతండును విద్యాగృహమునకుఁ బోయి వైశంపాయనునితో విద్యాభ్యాసము చేయుచున్న చంద్రాపీడునిం గాంచి నమస్కరించి తదానతి నుపవిష్టుండై యిట్లనియె.

భర్తృదారక! నీవు సకలవిద్యలయందును బ్రౌఢుడవైనట్లు విని తారాపీడుఁ డెంతేని సంతసించి చంద్రదర్శనమునకు సముద్రుండువలె నిన్నుఁ జూచుటకుఁ గోరుచున్నవాఁడు. మీరు విద్యాభ్యాసమునకుఁ బ్రారంభించి పది సంవత్సరము లయినది ఆరవయేటఁ బ్రారంభించుటచే నేటికిఁ బదియారేఁడుల ప్రాయము గలిగి యుంటిరి. మీ తల్లులు మిమ్ముఁ జూచుటకు మిగుల వేడుకపడుచున్నారు. యౌవనసుఖముతోఁ గూడ రాజ్యభోగ మనుభవింపుము. రాజలోకమును సన్మానింపుము. బ్రాహ్మణులఁ బూజింపుము. ప్రజలఁ బరిపాలింపుము. ఇంద్రాయుధమగు తురగరత్న మిదిగో యధిష్టించిరమ్ము. మీ తండ్రిగారికి దీనిఁ బారశీకదేశపురాజు సముద్రములోఁ బుట్టినదనియు నతివేగము గలదనియుఁ గానుకగాఁ బంపెను. దీనింజూచి పరీక్షించిన వారు ఉచ్చైశ్రవమునకుఁగల చిహ్నము లున్నవని చెప్పుచున్నారు. చూడుఁడని పలుకగా విని యా రాజకుమారుఁడు వైశంపాయనునితోఁ గూడ నా యశ్వలక్షణములన్నియుం బరీక్షించి వెరగందుచు నది యమానుషమని చెప్పుచు దానికి ముమ్మారు వలగొల యాగుర్ర మెక్కెను.

అప్పు డ త్తత్తడి సంతసించుదానివలె తోక నాడించుచు సకిలించినది. అదియే శుభశకునముగాఁ దలంచి విద్యాగృహము బయలు వెడలి వైశంపాయనుఁడును వేరొకతురగ మెక్కి తోడురా రాజమార్గంబున నడచుచుండెను.

రాజపుత్రుండు సమాప్తసకలవిద్యుండై విద్యాగృహమునుండి వచ్చుచున్నవాఁడను వార్త విని పౌరకాంతలెల్ల నుల్లము లుత్సుకోత్ఫుల్లములై యొప్ప దెప్పున నప్పురుషరత్నముం జూడ వేడుకపడుచు సగముసగముగా నలంకరించుకొనియుఁ బూర్తికాకుండఁగనే సౌధాంతరంబులం జేరి మరకతవాతాయనవివరములనుండి యా నరేంద్రనందను నీక్షింపఁదొడంగిరి.

అప్పు డామేడలనుండి మకరధ్వజవిజయనినాదము ననుకరింపుచు రమణీమణుల మణిభూషణఘోషము శ్రోత్రపర్వముగాఁ బయలువెడలినది. ముహూర్తకాలములో నంతఃపురములన్నియు యువతిజననిరంతరము లగుట స్త్రీమయములైనట్లు ప్రకాశించినవి.

కౌతుకప్రసారితనయనలై చూచుచున్న యమ్మగువల హృదయంబు లద్దములవలె నారాజసూనుని యాకృతి నాకర్షించినవి. అప్పు డావిర్భూతమదనరసావేశహృదయలై యమ్మదవతు లొండొరులు సపరిహాసముగా సాక్షేపముగా సాభ్యసూయముగా సోత్ప్రాసముగా నిట్లు సంభాషించుకొనిరి.