పుట:కాశీమజిలీకథలు-05.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

247

    నయశాస్త్రముల నభినయశాస్త్రములఁ జాప
          చక్రకృపాణాదిసాధనముల
    గజతురంగాదిశిక్షలఁ జిత్రరత్నప
         రీక్షల యంత్రతాంత్రికములందు
    గావ్యనాటకవరాఖ్యాయికాదుల సర్వ
        లిపిసర్వభాషావిలేఖనముల

గీ. గ్రంథరచనల శిల్పకర్మల నశేష
    కళల శృంగారరస దలంకారములను
    సకలవిద్యల నక్కుమారకుల కపుడు
    కలిగె నత్యంతపాండిత్యకల్పనంబు.

మరియు నారాజపుత్రునకు బాల్యమునందె సర్వలోకవిస్మయజనకమగు మహాబలంబు గలిగియుండెను.

యదృచ్ఛముగా నెదురుపడిన కరికలభంబుల చెవులు పట్టుకొని వంచిన నవి సింహపోతభంజితములవలెఁ గదలలేక నిలువంబడునవి.

కదళీకాండమువలెఁ దాళవృక్షముల నొక్కవ్రేటున నరికివైచును. పరశురాముండువలె నతండేయు బాణములచేఁ బర్వతములు గూడఁ జిల్లులు పడుచుండును. పదుగురు మోయలేని యినుపదండ మవలీలఁ గేలం దాల్చి గిరగిరఁ ద్రిప్పును.

ఒక మహాశక్తితక్క తక్కినవిద్యలన్నియుఁ జంద్రాపీడునితో సమముగా వైశంపాయనుఁడు గ్రహించెను. విద్యాపరిచయబహుమానంబున శుకనాసునియందుఁ గల గౌరవమునఁ బుట్టినది మొదలు పాంశుక్రీడ లాడుచు నేకముగాఁ బెరుగుట లోనగు కారణములచే రాజపుత్రునకు వైశంపాయనుఁడు రెండవ హృదయమువలె విస్రంభపాత్రమగు మిత్రమై యొప్పుచుండెను. నిమిషమైన వాని విడిచి యొక్కఁడు వసింపఁడు.

వైశంపాయనుఁడును సూర్యుని దివసమువలె విడువక సంతత మనుసరించి తిరుగుచుండును. అట్లు విద్యాభ్యాసము చేయుచుండ బ్రదోషమునకుఁ జంద్రోదయమువలె సముద్రున కమృతరసమట్లు కల్పపాదపమునకు ప్రసూనోద్గమముభంగి కమలవనమునకు సూర్యోదయముభాతి సౌందర్యమున కధికశోభ దెచ్చుచు నా నరేంద్రనందనునకు యౌవనోదయమైనది.

సమయము నరసి మన్మథుఁడు సేవకుఁడువలెనే వారి నాశ్రయించెను. లక్ష్మితోగూడ వక్షస్థలము విస్తరించెను. ఇట్లు వారు సమారూఢయౌవనులును సమాప్తసకలవిద్యగులు నగుచుండ వారి వార్త విని తారాపీడుఁడు మిగుల సంతసించుచు బలాహకుఁ డను సేనాపతిఁ బిలిచి శుభముహూర్తమున వారిం దోడ్కొని రమ్మని యాజ్ఞాపించెను.