పుట:కాశీమజిలీకథలు-05.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

కాశీమజిలీకథలు - ఐదవభాగము

    ఫాలంబు శిశునిశాపాలాభిరామంబు
          సార్వభౌమాంకలక్షణత మెఱసె
    గనుఁగవ సితపద్మక్రమంబు త్రిభువన
          ప్రభుతానుభావవైభవము దెలిపె

గీ. గంటివే వీనిరూప ముత్కంఠ వొడమె
    నోనరేశ్వర! వింటివే వీనికంఠ
    రవము దుందుభివలె సుస్వరత నెసంగె
    వీఁడు బ్రోవఁగఁజాలు నీవిశ్వమెల్ల.

అని యబ్బాలకశిఖామణి యంగశోభావిశేషములు వర్ణించుచున్నసమయంబున ద్వారస్థులనెల్ల ద్రోసికొనుచు నతిరయంబున నొక పురుషుం డరుదెంచి ఱేనికి మొక్కి దేవా! విజయమగుఁగాక. శుకనాశుని భార్య మనోరమకు రేణుకకుఁ పరశురాముండు వోలెఁ గుమారుం దుదయించెనని యెరింగించెను.

అమృతోపమితములగు నప్పలుకులు విని యజ్జనపతి బాష్పపూరితనయనుండై యోహూ! కల్మాణపరంపర! మిత్రమా! శుకనాస! విధి సమానసుఖదుఃఖత్వమును సూచింపుచు నీడవోలె న న్ననుగమించెంగదా? అని పలుకుచు నా వార్త తెచ్చిన పురుషున కపరిమితముగాఁ బారితోషిక మిచ్చి యప్పుడమియొడయఁడు ప్రగ్గడతోఁగూడ నతనియింటి కరిగి తత్సుతముఖదర్శనంబు గావించి పుత్రోత్సవము పంచి పెట్టించెను.

క్రమంబునఁ బురిటిరాత్రులు గడిచినంత మహావైభవముతో యథావిధి జాతకకర్మాదివిధులు నిర్వర్తించి, స్వప్నంబునఁ జంద్రమండలము సతీముఖంబునం బ్రవేశించుచున్నట్లు చూడఁబడుటం జేసి రాచపట్టికిం జంద్రాపీడుఁ డని పేరుపెట్టెను.

శుకనాసుఁడును, రాజానుమతి బ్రాహ్మణకులోచితములైన విధులన్నియుం దీర్చి కుమారునకు వైశంపాయనుడని నామకరణము జేసెను.

కాలక్రమంబున నాఁబాలునకు శైశవ మతిక్రమించినంతఁ దారాపీడుఁ డానగరమున కనతిదూరములో మనోహరమణిశిలాలలితమగు విద్యామందిరము గట్టించి సకలవిద్యాపారంగతులగు నుపాధ్యాయులఁ బెక్కండ్ర నియమించి వైశంపాయనునితోఁ గూడఁ జంద్రాపీడుం జదివింపుచుండెను.

రాజపుత్రుఁడు మంత్రిపుత్రునితోఁగూడ ననన్యగతమానసుండై యచిరకాలములో నాచార్యులవలన మణిదర్పణముల వలె నశ్రమముగా సమస్తవిద్యలుం గ్రహించెను.

సీ. మరి పదవాక్యప్రమాణంబులను శబ్ద
          శాస్త్రమ్మునం దర్థశాస్త్రమందు