పుట:కాశీమజిలీకథలు-05.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

231

శ్రీరస్తు

కాశీమజిలీకథలు

ఉత్తరఖండానుబంధము

కాదంబరి

శూద్రకమహారాజు కథ

గీ. పుడమి గలిభయమునఁ బ్రోగుపడిన కృతయు
   గంబనఁగ సర్వధర్మప్రకాశమగుచు
   సారవేత్రవతీనదీతీరమందు
   విదిశ యను రాజధాని సంపదలఁ బొదలు.

అప్పట్టణంబున కధినాయకుండై శూద్రకుండను రాజు సకలనృపశిరస్సంధానితశాసనుండై రెండవ పాకశాసనుండువోలె భూమండలమంతయు నేకాతపత్రముగఁ బాలించుచుండెను.

అన్నరవరుం డనవరతదానజలార్ద్రీకృతకరుండై దిగ్గజంబువోలెఁ బ్రతిదివసోపజాయమానోదయుండై ప్రభాకరుని చందమున నొప్పుచు సర్వశాస్త్రములకు దర్పణమనియు, గళల కుత్పత్తిస్థానమనియు, సుగుణములకుఁ గులభవనమనియు, మిత్రమండలమున కుదయశైలమనియు, రసికుల కాశ్రయుఁడనియు, ధనుర్ధరులకుఁ బ్రత్యాదేశమనియుఁ బొగడ్త కెక్కెను.

మరియు, దృఢముష్టినిష్పీడనంబునం బయలువెడలిన జలధారయుంబోలె నా భూపాలు కేలంగ్రాలు కరవాలంబు కరికటతడగళితమదజలాసారదుర్దినములగు సంగర సమయములయందు వీరభటకవచసహస్రాంధకారమధ్యవర్తినియై యున్న జయలక్ష్మి నభిసారికవోలెఁ బెక్కు సారు లతనిచెంతకుఁ దీసికొనివచ్చినది.

అయ్యవనీపతి కువలయభరంబు వలయంబువోలె నవలీల నిజభుజాగ్రంబున భరించుచుఁ బలుమారు నీతిశాస్త్రములెల్ల నవలోకించి బుద్ధిబలముచే బృహస్పతినైనం బరిహసించుచుఁ బ్రబుద్ధులని వాడుకజెందిన కులక్రమాగతులగు మంత్రులు సేవింప సమానవయోవిద్యవిభూషితులు ప్రేమానురక్తహృదయులు నసమసమరక్రీడాభిరతులునగు రాజసుతులతోఁ గూడికొని క్రీడించుచుఁ బ్రథమవయస్సు సుఖముగా వెళ్ళించెను.