పుట:కాశీమజిలీకథలు-05.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

229

కొనుచు, నోరీ! మాకు భాగ్యముతోఁ బనిలేదు. వైరాగ్యముగాఁ దిరుగుచుందుము. లోకోపకారమునకై పాటుపడుచుంటిమి.

నాయిచ్చు విద్యవలన నీకులమునకు మిగుల భాగ్యమును, వాడుకయు రాగలదు. కావలసినంత బంగారము నిత్యము నీవు చేసికొనవచ్చును. ఇఁక నీకీ నీచ వృత్తితోఁ బనిలేదని చెప్పుటయు నయ్యీడిగవాఁ డంగీకరించి శంకరులకుఁ దొలుతఁ దన విద్య నెరింగించెను. పిమ్మట శంకరులు భర యోగము వాని కెరింగించెను. అట్టి విద్య సంగ్రహించి శంకరులు మండను గృహము దాపునకుఁబోయి ప్రహరిచుట్టును దిరిగి యాగోడప్రక్క నంటియున్న నారికేళవృక్షముల మంత్రించి వంగినంత వానిపైనెక్కి పైకెగసి కోటలోఁ బ్రవేశించి శ్రాద్ధకాలంబున నప్పండితునిగాంచి సంభాషించి పిమ్మట బ్రసంగంబు గావించి యోడించెనని యొకవాడుక యున్నది.

అయ్యీడిగవాడును శంకరులవలనఁ గనకయోగ విద్యను గ్రహించి తత్ప్రభావమువలన ననంతమైన బంగారమును జేయుచుఁ గాసులగాబోయించి లోకమున వ్యాపింపఁజేసెను వానినే యీడిగ కాసులని యిప్పటికిని వాడు చుందురు. ఆ కాసులిప్పటికి నక్కడక్కడ దొరుకుచుండును. హఠయోగాది విద్యల ప్రవీణుండై యాకాశ సంచారము చేయనేర్చిన శ్రీశంకరాచార్యులవారికి మండనుని ప్రహరి దాటుట శక్యమైనది కాదని చెప్పుట హాస్యాస్పదమై యున్నదికాని యల్పులవద్దనుండియైన విద్యా విశేషము సంగ్రహింపవలయునను న్యాయము ననుసరించి దానివలనఁ దనకొక ప్రయోజనము లేకపోయినను గాంచనయోగముజెప్పి యావిద్య గ్రహించియుండవచ్చును.

నాస్తికులలో వాదించునప్పుడు వారు దైవముగలఁడని నిదర్శనము జూప గలవా యని యడిగిన శంకరులు సహస్ర సంభమంటపమున నిలువంబడి యొకతాళ వృక్షము చేతంబూని స్తంభములకుఁ దగులకుండ గిరిగిరం ద్రిప్పి వారి నాత్మశిష్యులగాఁ జేసికొనియెను. మరియొకచోట దైవముగలఁడని యెర్రగాఁగాచిన సీసము పాలం బోలె గ్రోలి జెక్కు జెదరక మెరయుచుండెను. మరియొకచోటఁ గొండయెక్కి నేల కురికెను.

ఈరీతి పుడమిగల దుర్మతంబులనెల్ల ఖండించి ప్రజలనెల్ల సన్మార్గ ప్రవర్తకులుగాఁజేసి యమ్మహాత్ముండు ముప్పదిరెండేడులు పూర్తియైనంతఁ దత్వబోధము గావింప శిష్యులు బీఠాధిపతుల గావించి పిమ్మట బృందారక బృందప్రార్థితుండై వెండియు వెండికొండకు విచ్చేసెనని

క. అద్వైతగురుచరిత్రము
   సద్వేత్యంబిది పఠింప సద్భక్తిమెయిన్
   విద్వన్నుత నిర్వృతి సం
   పద్వైభవములు లభించుఁ బరిపూర్ణమ గాన్.