పుట:కాశీమజిలీకథలు-05.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

141

    నందకముఖ్యసాథనకనత్కలరులన్మణికింకిణీరణ
    త్స్యందనయుక్తులన్సుగుణనక్తులవెన్నునికూర్మిభక్తులన్.

వ॥ ఆ వృద్ధాంగనముందరఁ గనుఁగొని యానందముతోఁ దండ్రీ యిప్పుడు శాంతులైన వారెవ్వరోవచ్చి మెఱపువలె మెఱయుచున్న రథముమీదికి నన్ను రమ్మని పిల్పుచున్నారు. పోయివత్తు నిదియంతయు నీ మహిమయేకదా? వెనుకయిచ్చిన వరము మరువకుమీ యని పలుకుచు నామె ప్రాణములు విడిచి దివ్యదేహంబుఁ దాల్చి యవ్విమానం బధిరోహించి పరమపదము నొందినది

పిమ్మట శంకరుండు తల్లికిచ్చిన వరము చెల్లించు తలంపుతో నపర సంస్కారములు సేయఁదలంచి ప్రధానజ్ఞాతియగు యజ్ఞభట్టారకుం జీరి యందులకుఁ దగిన సన్నాహముఁ గావింపుమని జెప్పెను.

ఆ వార్త విని కాలట్యగ్రహారములో నున్న బ్రాహ్మణులెల్లరు నొకచోట సభఁజేసి యిట్లు సంభాషించుకొనిరి.

సభాపతి — ఏమండోయి శివగురుని కొడుకు తల్లిని జ్ఞాతుల పాలుజేసి సన్యాసము తీసుకొని యిప్పుడామెకుఁ గర్మచేయఁదలచుకొన్నాఁడట. రమ్మనమని గ్రామస్థులకు యజ్ఞభట్టారకుండు కబురుఁజేసెను. మనమందరము పోవలసినదా? మాన వలసినదా ?

కొందరుబ్రాహ్మణులు — సన్యాసికిఁ గర్మచేయు నధికారమే శాస్త్రములోఁ జెప్పబడియున్నది ఆ కార్యకారణము చేయునప్పుడు మన మేలాగున వెళ్ళుదుము ?

మరికొందరు — అతఁడు జగత్పండితుఁడుగాని సామాన్యుఁడుకాఁడు అది యకార్యమో కార్యమో యతనికన్న మనకెక్కుడుగా దెలియునా యేమి ?

కొందరు — ఇదియే మూర్ఖత. ఏ కాలములో నైన సన్యాసి కర్మ చేసినట్టు చెప్పికొనుటగాని వినుటగాని యున్నదా ? శాస్త్రముమాట యటుండనీయుఁడు.

సభాపతి — కర్మయే పనికిరాదని దేశములు నెల్లెడల వాదించుచుఁ దానిప్పుడు తల్లికెటు కర్మచేయఁ బూనుకొనుచున్నాఁడు? చెప్పునది యొకటి చేయునది యొకటియునా ?

మరికొందరు — ఇంత వితర్కమేల ? పోయి యడుగరాదా ?

సభాపతి — వీరవర్మ యడిగినంత నేవియో నాలుగు డాంబికములు చెప్పి యతనిని మాట్లాడనిచ్చినాఁడు కాఁడఁట.

మరికొందరు — పోనీ నీవు వెళ్ళి యడుగుము.

సభాపతి — నా కంత యవసరమేల? అచ్చటి కెవ్వరు పోకుంటే నా యొద్ద కతండేవచ్చునుకదా ?

మరి - మనలో మనము తగవులాడుట మంచిదికాదు. మనమందరము పోయి యతనితో మాటాడి యుక్తానుసారముగా నాచరింతుముగాక.