పుట:కాశీమజిలీకథలు-05.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

139

చిత్సుఖుఁడు - హస్తామలకా! మనసందియము దీరినది. యందులకే మన గురుండు సమాధి గైకొనియె. మన కేమి చెప్పునో వడిగా బోవుదుము లెమ్ము.

అని పలికికొని తోటకునితోఁగూడ నిష్క్రమించిరి. పిమ్మట శంకరాచార్యులు ప్రాణోత్క్రమణసమయ మగుచుండ స్మరింపఁబడి యందు బోవుచుఁ శిష్యులనెల్లఁ దాను వచ్చునందాక నందుండ నియమించి యోగశక్తిచే గగనమార్గంబున ముహూర్తకాలములోఁ దల్లియున్న నెలవునకుం జని "అయ్యో! కుమారా! యిట్టి సమయమున నీవు నాయొద్ద లేకపోయితివే. నీవంటి యుత్తమపుత్త్రుం గనియు గొడ్డురాలిపోలిక ననాథనై పొలియవలసెనే! కటకటా! భవద్దర్శనలాలసంబులై యీ బొంది విడువక కృపణప్రాణంబులు నన్నూరక శ్రమనొందుచున్నవి. హా! యెంత పాపాత్ము రాలనైతిని. నందనా యెందుంటివి? ఎవ్వరికి బోధ సేయుచుంటివి? ఒక్కసారి వచ్చి నాకన్నులం బడరాదా? నిన్ను జూచినంత నాయావడులన్నియు నుడిగిపోవకుండునా? నాతో నెన్నియో చెప్పిపోయితివే అవి యన్నియు మఱచితివి కాఁబోలు తండ్రీ యీ వృద్థమాతయం దింత యక్కిటకము లేకపోయినే ఆహా! మరణకాలంబున స్మరించినంతనే వచ్చి యూర్థ్వదైహికక్రియలు గావింతునని శపథముగాఁ బలికితివే నాయనా! యేమిటికి రావు? ఎందున్నావు క్షేమముగానుంటివో లేదో హాపుత్రా! హాపుత్రా!" యని పలవరింపుచున్న తల్లింజూచి శంకరుండు నిస్సంగుడైనను దయాళుండగుటఁ గన్నుల నీరు గార్చుచు నిట్లనియె.

అమ్మా! ఇదిగో నేను వచ్చితిని. నీపుత్త్రుండ శంకరుండ ఇక నీవు విచారింపకుము. నీయభీత్స మెద్దియో చెప్పుము చెచ్చెరం గావింతునని పలుకుచుఁ బాదంబులకు నమస్కరించెను. అప్పు డామె నిదాఘార్తు డంబుదనాదంబునంబోలె నాత్మీయపరితాపంబు వదలి సంతోషముతోఁ బుత్త్రుం గౌఁగిలించుకొని తండ్రీ నాయీయవస్థలో నీవు కుశలముగా వచ్చి నాకన్నులం బడితివి. ఇంతకన్న సంతోష మేమి యున్నది? పుత్రా! జరాశీర్ణంబగు నీగాత్రంబింతమీఁద వహింపలేకున్నదాన. యథాశాస్త్రముగా నా దేహము సంస్కరించి పుణ్యలోకముల నొందింపుము. ఇదియే నా కోరిక యని పలికినది.

తల్లి మాట విని శంకరాచార్యుం డంతర్భూతసర్వలోకసుఖమగు బ్రహ్మానందము నొందింపు తలంపుతోఁ దల్లికి స్వప్రకాశమగు శుద్ధనిర్గుణతత్త్వ ముపదేశించెను. అప్పు డయ్యంబ శంకరునితో, నాయనా! నీవేమో నాకుఁ జెప్పితివికాని యేమియుం దెలిసినదికాదు ఇట్టిసమయమున నిర్గుణుని నెట్లు మనస్సునం బట్టించుకొందును? అతిమనోహరమగు సగుణతత్త్వ ముపదేశింపుము. ఆనందింతునని పలికిన విని శంకరుండు దయాళుం డగుచుఁ దల్లికి దర్శనమిచ్చుటకై భక్తవశంకరుండైన శంకరుని భుజంగప్రయాతవృత్తములచే నిట్లు స్తుతియించెను.